
మాతృదేవోభవ.. పితృదేవోభవ
మోత్కూరు : మాతృదేవోభవ–పితృదేవోభవ అనే స్వచ్ఛంద సంస్థ విస్త్రృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతోంది. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన కురుమేటి నవీన్ ఏర్పాటు చేసిన మాతృదేవోభవ–పితృదేవోభవ సంస్థ ద్వారా గ్రామీణ నిరుపేద, వృద్ధులు, అనాథలు, విద్యార్థులకు ఐదు సంవత్సరాలకు పైగా వివిధ రకాల సేవలను అందిస్తోంది. నవీన్కు 6 సంవత్సరాల వయస్సులోనే తండ్రి నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి నర్సమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబ బాధ్యతలు మోస్తూ ఇద్దరు కుమారులు, నవీన్, నరేందర్ను చదివించింది. నవీన్ 8వ తరగతి చదువుతుండగానే తల్లి నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. అమ్మమ్మ, నానమ్మ, బాబాయి గోవర్ధన్ల పర్యవేక్షణలో పెరుగుతూ నవీన్ 10వ తరగతి పూర్తి చేశాడు. మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదవలేక జనరల్ నర్సింగ్ మెడిసిన్ (జీఎన్ఎం) కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ మరోవైపు సామాజిక సేవ చేస్తున్నాడు. మే 2019లో మాతృదేవోభవ–పితృదేవోభవ స్వచ్ఛంద సేవా సంస్థను నవీన్ ఏర్పాటు చేశాడు. నవీన్ అధ్యక్షుడిగా, తమ్ముడు నరేందర్ ఉపాధ్యక్షుడిగా, బాబాయి కురుమేటి గోవర్ధన్ సహకారంతో సేవలు అందిస్తున్నాడు. గ్రామంలోని పెద్ద మనుషులు, దాతలు, విద్యావంతులు సూరారం యాదయ్య, చిరుమర్తి యాదయ్య, కురుమేటి యాదయ్యల సహకారంతో పేదలకు సేవ చేస్తున్నాడు.
వృద్ధులకు కంటి వైద్య శిబిరాలు..
మోత్కూరు, గుండాల, అడ్డగూడూరు మండలాల్లోని అనేక గ్రామాల్లో ఆదరణకు నోచుకోని వృద్ధులు, వితంతువులకు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో బియ్యం, నిత్యవసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. మోత్కూరు, గుండాల మండల కేంద్రాల్లో హైదరాబాద్కు చెందిన మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి సహకారంతో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మందులు అందజేశారు. కరోనా సమయంలో పాటిమట్ల గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించి దాతల ద్వారా రక్తాన్ని సేకరించారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, దుస్తులు పంపిణీ చేశారు. రామన్నపేట మండలం కక్కిరేణిగూడెంలో హైదరాబాద్ బీఎన్.రెడ్డి నగర్కు చెందిన సుశీల ‘కంటి ఆస్పత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 30 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. స్వగ్రామం పాటిమట్లలో తన ఇంటినే గ్రంథాలయంగా ఏర్పాటు చేసి 30 మంది పిల్లలకు చదువు చెబుతున్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అంబులెన్సు సర్వీస్ ఏర్పాటు చేసి సుమారు 100 మందికి పైగా సహాయం చేశారు. 2024లో విజయవాడలో వచ్చిన అకాల వర్షాలు, వరద బాధితులకు తన స్నేహితులతో కలిసి 500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఖమ్మంలో అకాల వర్షాలకు నివాసాన్ని కోల్పోయిన సుమారు 500 మంది బాధితులకు భోజన ప్యాకెట్లను అందజేశారు.
నేడు రక్తదానంపై అవగాహన
పాటిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాతృదేవోభవ – పితృదేవోభవ 6వ వార్షికో త్సవం బుధవారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రక్తదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ హాజరవుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నవీన్ తెలిపారు.
● వృద్ధులు, నిరుపేదలు,
అనాథలను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థ
● నేడు పాటిమట్లలో
6వ వార్షికోత్సవం

మాతృదేవోభవ.. పితృదేవోభవ