
కాంగ్రెస్ పాలనలో అధికారులకు రక్షణ కరువు
రామన్నపేట : కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ అధికారులకు రక్షణ కరువైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఇరిగేషన్ అధికారులపై దాడి జరిగితే బాధ్యత గల అధికార పార్టీ నాయకులే కేసు లేకుండా చేశారని ఆరోపించారు. గవర్నర్ అధికార నివాసంలో చోరీ జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఎగుమతులు, గన్నీ బ్యాగుల సరఫరాలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో హడావిడి చేసి పేదల ఇళ్లను కూల్చారని, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధించడం మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు బద్దుల ఉమారమేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్గౌడ్, సాల్వేరు అశోక్, అంతటి రమేష్, ఎస్కే చాంద్, బత్తుల వెంకటేశం, గర్దాసు విక్రం, మిర్యాల మల్లేశం, జాడ సంతోష్, ఆమేర్, బొడ్డు అల్లయ్య, కూనూరు శ్రీనివాస్, బాలగోని శివ, జాల అమరేందర్రెడ్డి ఉన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య