
మేం చెప్పినోళ్లకే ఇవ్వాలి!
పథకాల లబ్ధిదారుల జాబితా తయారీలో పంచాయతీ కార్యదర్శులపై నాయకుల ఒత్తిడి
మిర్యాలగూడ : పభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో వారధులుగా పని చేసే పంచాయతీ కార్యదర్శులపై నాయకుల ఒత్తిడి పెరుగుతోంది. సంక్షేమ పథకాల అమలులో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నారు. అయితే గ్రామాల్లో నాయకులు కొందరు తాము చెప్పిన పేర్లు మాత్రమే లబ్ధిదారుల లి్స్ట్లో చేర్చాలని కార్యదర్శులపై బెదిరింపులకు దిగుతున్నారు. తమ మాట వినకపోతే దాడులు సైతం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు సాగుతోందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. నాయకుల తీరుతో అర్హులకు పథకాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి.
ధీరావత్తండాలో కార్యదర్శిపై దాడి
మిర్యాలగూడ మండలం ధీరావత్తండాలో సోమవారం ఇరిగేషన్ ఏఈ రామకృష్ణతో కలిసి పంచాయతీ కార్యదర్శి కోల సాయికుమార్ ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ నాయకుడు తాను చెప్పిన పేర్లు ఎందుకు లిస్ట్లో చేర్చలేదని కార్యదర్శిని బెదిరించాడు. తాను ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇరిగేషన్ ఏఈతో కలిసి సర్వే చేస్తున్నానని, అర్హుల జాబితా తయారీ విషయం తనకు సంబంధం లేదని సదరు కార్యదర్శి చెప్పాడు. అయినా ఆ నాయకుడు వినకుండా పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్తులు వారించినా వినకుండా కార్యదర్శిపై దుర్భాషలాడాడు. దీంతో దాడికి పాల్పడిన నాయకుడిపై పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ మిర్యాలగూడ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాను చెప్పిన పేర్లు చేర్చలేదని దాడి చేశాడు
గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా నేను ఇరిగేషన్ ఏఈతో కలిసి పాల్గొన్నాను. అయితే గ్రామానికి చెందిన ఓ నాయకుడు తాను చెప్పిన పేర్లు ఎందుకు లిస్ట్లో చేర్చలేదని నాపై దుర్భాషలాడి దాడి చేశాడు. దాడికి పాల్పడిన వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి.
– కోల సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి, ధీరావత్తండా
రక్షణ కల్పించాలి
నిస్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై నాయకులు దాడులు చేయడం హేయమైన చర్య. ఉన్నతాధికారుల ఆదేశానుసారమే లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నాం. స్థానిక నాయకుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం. ప్రతి గ్రామపంచాయతీలో ఇలాంటి ఒత్తిడిలు అధికమయ్యాయి. ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి.
– కోడిరెక్క శైలజ, టీపీఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
కఠిన చర్యలు తీసుకోవాలి
కార్యదర్శిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసుశాఖ చర్యలు తీసుకోవాలి. దాడి జరిగిన వెంటనే రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాం. పథకాల లబ్ధిదారులకు సంబంధించిన జాబితా ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. కార్యదర్శిపై జరిగిన దాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– రాఘవరావు, డీఎల్పీఓ
ఫ నేతలకు నచ్చినట్లు పనిచేయకపోతే బెదిరింపులు
ఫ ధీరావత్తండాలో కార్యదర్శిపై దాడి చేసిన ఓ పార్టీ నాయకుడు
ఫ రక్షణ కరువైందంటున్న పంచాయతీ కార్యదర్శులు
ఇప్పటికే పని ఒత్తిడి.. మరోవైపు దాడులు
గ్రామాల్లో సర్పంచ్ల పాలన ముగియడంతో బాధ్యతంతా పంచాయతీ కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీదిలైట్ల ఏర్పాటు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడడంవంటి అనేక పనులను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు నిధులు సరిగా రాకపోయినా అప్పులు తీసుకొచ్చి మరీ గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబసర్వే, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సర్వేలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా వంటి పథకాలకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంత ఒత్తిడిలో పని చేస్తున్నా.. ఇప్పుడు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో గ్రామాల్లో నాయకుల తీరుతో ఆందోళన చెందుతున్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై బెదిరింపులు ఆపాలని కోరుతున్నారు.

మేం చెప్పినోళ్లకే ఇవ్వాలి!

మేం చెప్పినోళ్లకే ఇవ్వాలి!

మేం చెప్పినోళ్లకే ఇవ్వాలి!