
పాముకాటుతో రైతు మృతి
వంగూరు: మండలంలోని సర్వారెడ్డిపల్లి తండాకు చెందిన రైతు నేనావత్ శ్రీను(36) సోమవారం పాముకాటుకు గురై మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. శ్రీను మండలంలోని ఉల్లంపల్లి శివారులో పది ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. సోమవారం వ్యవసాయ పనుల కోసం తండా నుంచి కొంతమంది కూలీలను తీసుకొని పొలానికి వెళ్లాడు. కూలీలు ఒకవైపు వరి మడుల్లో పనిచేస్తుండగా శ్రీను మరో మడిలో పనిచేస్తూ పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కూలీలు గమనించి, పాటు కాటు వేసిందని గుర్తించి చికిత్స కోసం ఆటోలో వంగూరుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో కల్వకుర్తికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కమారులు ఉన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారిపై ఉండవెల్లి శివారులో అర్ధరాత్రి గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టాయి. దీంతో రోడ్డుపై అవయవాలు చెల్లాచెదురైన మృతుదేహాన్ని హైవే సిబ్బంది గుర్తించి పోలీసులకు సోమవారం సమాచారం అందించారు. సమాచారం తెలియడంతో నేరుగా ఎస్ఐ శేఖర్ మృతదేహం వద్దకు వెళ్లి పరిశీలించారు. హైవే సిబ్బందికి దొరికిన అవయవాలను పోలీసులు అలంపూర్ మార్చురీకి తరలించారు. మృతి చెందిన మహిళ చీర పసుపు పచ్చరంగు, ఎరుపు రంగు జాకెట్, ఒక నలుపు రంగు సంచి, తాళం చెవి, ఒక ఆంత్రం ఉందన్నారు. గుర్తించిన వారు ఉండవెల్లి పోలీస్స్టేషన్ను సంప్రదించాలని ఎస్ఐ శేఖర్ సూచించారు.
మహిళ మృతి
లింగాల: కుటుంబ కలహాలతో ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్తచెర్వుతండాకు చెందిన ఆరెకంటి లక్ష్మి(42) ఈ నెల 12న కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లి పోయింది. కుటుంబ సభ్యులు ఆమెను ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. కొత్తచెర్వుతండా నుంచి అంబట్పల్లి మార్గంలో ఓ నీటి గుంటలో పశువుల కాపర్లకు ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన మహిళగా ఆమెను గుర్తించారు. ఆమెకు భర్త కురుమయ్య, ముగ్గురు సంతానం ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వివాహిత అదృశ్యం
నవాబుపేట: మహిళ అదృశ్యమైన ఘటనపై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. మండలంలోని కొండాపూర్కు చెందిన వడ్డె మహేశ్వరి(30) ఇంట్లో నుంచి ఆదివారం రాత్రి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. ఈ విషయంలో భర్త వడ్డె శేఖర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, మహిళ తనతోపాట ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రించామని.. తాను నిద్రలోకి వెళ్లిన అనంతరం మధ్యరాత్రి మెళకువ వచ్చి చూస్తే ఆమె కనిపించలేదని పోలీసులకు వివరించాడు. సోమవారం బంధువులు, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ విషయంలో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వాస్మోల్ తాగి మహిళ బలవన్మరణం
గోపాల్పేట: అప్పుల బాధ భరించలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేశ్కుమార్ కథనం ప్రకారం.. పొలికెపాడుకు చెందన కేతేపల్లి నిరంజన్ కూరురు మనీషా(26)కు ఏడేళ్ల కిందట శ్రీపురం గ్రామానికి చెందిన కుర్మయ్యతో వివాహమైంది. ఏడాది తర్వాత విడాకులు తీసుకుంది. అనంతరం తండ్రితోపాటు హైదరాబాద్లో ఉంటూ కిరాణా షాపు నడిపించుకుని బతుకుతుండేది. రెండేళ్ల కిందట కిరాణాషాపు షార్ట్ సర్క్యూట్లో దగ్ధమై సుమారు రూ.8లక్షల వరకు నష్టపోయింది. తెలిసినవారితో అప్పులు చేసి కిరాణాషాపు తిరిగి ప్రారంభించింది. సరిగ్గా నడవకపోవడంతో మనస్తాపానికి గురైంది. పొలికెపాడు చేరుకొని ఆదివారం వాస్మోల్ తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వనపర్తి ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. తండ్రి నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

పాముకాటుతో రైతు మృతి

పాముకాటుతో రైతు మృతి