
కిచెన్ గార్డెన్లతో పోషకాహారం
నాగర్కర్నూల్: అంగన్వాడీల్లో నమోదైన చిన్నారులు, గర్భిణిలు, బాలింతల ఆరోగ్యంపై ప్రభు త్వం మరింత దృష్టి సారించనుంది. వారికి పోషకాలతో కూడిన ఆహారం అందించేలా చర్యలు చేపడుతుంది. వంటకు వినియోగించే కూరగాయలను అంగన్వాడీ కేంద్రాల్లోనే పండించేలా చర్యలు తీసుకుంటుంది. దీని కోసం ప్రత్యేకంగా నిధులు కూడా మంజూరు చేసింది. ఇక ఎంపిక చేసిన అంగన్వాడీల్లో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో చేసిన వంటకాన్ని చిన్నారులు, గర్భిణిలు, బాలింతలకు పెట్టనున్నారు.
జిల్లాలో..
జిల్లావ్యాప్తంగా మొత్తం 1,131 అంగన్వాడీ కేంద్రా ల ఉండగా.. ప్రస్తుతం 89 కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఒక్కో కిచెన్ గార్డెన్కు రూ.10 వేలు కూడా నిధులు కేటాయించగా అంగన్వాడీ కేంద్రా ల ఆవరణలో కూరగాయలు, ఆకుకూరలను పెంచనున్నారు. వంకాయ, బెండకాయ, పాలకూర, టమాట, తోటకూర, మెంతెంకూర వంటి పోషకాలు ఉన్న కూరగాయల సాగు పెంచనున్నారు. దీంతోపాటు కూరగాయల పెంపకంపై పిల్లలకు అవగాహన కూడా కల్పిస్తారు. ఇప్పటికే నిధుల వినియోగంపై అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కూడా కల్పించారు. ప్రస్తుతం మంజూరు చేసిన రూ.10 వేలు ఎలా వెచ్చించాలనే విషయం గురించి వివరించారు. ఈ నిధులను విత్తన కొనుగోలు, కుండీలు, మట్టి ఇతర పనిముట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా మొదటి విడతలో అంగన్వాడీ భవనాల్లో కూరగాయల సాగుకు అనుకూలంగా ఉన్న కేంద్రాలను ఎంపిక చేశారు.
సీడ్ కార్పొరేషన్ ద్వారా..
ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి విత్తనాల పాకెట్లను నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేశారు. దీనికి సంబంధించిన డబ్బులు సంవత్సరానికి రూ.500 చొప్పున చెల్లిస్తారు. సంవత్సరానికి రూ.వెయ్యి నిర్వహణకు అందజేస్తారు. అయితే ఐదేళ్ల పాటు కిచెన్ గార్డెన్లను నిర్వహించాల్సి ఉంటుంది. కేటాయించిన రూ.10వేలలో నారు పెట్టేందుకు రూ.3వేలు, రవాణా ఖర్చులకు రూ.వెయ్యి, విత్తనాలను నాటేందుకు భూమిని సిద్ధం చేసే ఖర్చుల కోసం రూ.వెయ్యి, పంట నిర్వహణ, నీటి వసతుల కల్పన కోసం రూ.ఐదు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించిన రూ.10వేలతోనే ఐదేళ్ల పాటు వీటి నిర్వహణ కొనసాగించాల్సి ఉంటుంది.
విత్తనాలను పంపిణీ చేశాం
కిచెన్ గార్డెన్లకు సంబంధించి ఇప్పటికే ఎంపిక చేసిన 89 అంగన్వాడీలకు విత్తనాలు పంపిణీ చేశాం. గర్భిణులు, పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు కిచెన్ గార్డెన్ల నిర్వహణ కొనసాగించాల్సి ఉంటుంది.
– రాజేశ్వరి, జిల్లా సంక్షేమాధికారిణి
జిల్లాలో 89 అంగన్వాడీలకు మంజూరు
ఒక్కో కేంద్రానికి రూ.10 వేలు కేటాయింపు
ఇప్పటికే విత్తనాలు పంపిణీ
గర్భిణులు, చిన్నారులకు ప్రయోజనం

కిచెన్ గార్డెన్లతో పోషకాహారం