
చాకలి ఐలమ్మపోరాట స్ఫూర్తి ఆదర్శం
నాగర్కర్నూల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు ప్రదర్శించారని, ఆమె పోరాటం స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శమని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇన్చార్జి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదగిరి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీరాములు, తహసీల్దార్ తబితా రాణి, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ రక్షణ కోసం ఏకం కావాలి
కల్వకుర్తి రూరల్: రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ ప్రజలంతా ఏకం కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ ఫలాలు సామాన్యులకు దక్కడం లేదన్నారు. దేశంలో 42 కోట్ల మంది దారిద్యరేఖకు దిగువన ఉన్నారని, 80 కోట్ల మంది ఇప్పటికీ రేషన్ బియ్యం కోసం ఎదురుచూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ 11 ఏళ్లలో పాలనలో సామాజిక అంతరం మరింత పెరిగిందని ఆరోపించారు. కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం పేదలపై భారం మోపుతుందని మండిపడ్డారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం జరిగే పోరాటానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శర్వాణి, ఏపీ మల్లయ్య, కాశన్న, పరశురాములు, హనుమంతు, చెన్నయ్య, చంద్రశేఖర్, ఖలీల్ విద్యార్థులు పాల్గొన్నారు.
17 నుంచి బీజేపీఆధ్వర్యంలో కార్యశాల
కందనూలు: ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా కార్యశాల నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్రావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన సేవా పక్షం–2025 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్షం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని మండల, మున్సిపాలిటీల్లో 75 యూనిట్లకు తగ్గకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 18వ తేదీ ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ అంశాలపై మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీలో స్థాయిలో చిత్ర లేఖనం, శక్తికేంద్రం, మండల కేంద్రంలో స్వచ్ఛభారత్, 21న నమో మారథాన్, యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. 25న ప్రవాస్–బూత్ స్థాయిలో మొక్కలు నాటడం, దీనదయాళ్ జీకి నివాళులర్పించడం, జిల్లా స్థాయిలో మేధావులతో సమావేశం, డాక్యుమెంటరీ ప్రదర్శన, ఖాదీ స్టాల్, 27న దివ్యాంగులకు సన్మానం, ఉపకరణాలు పంపిణీ, 28న విశిష్ట (పద్మశ్రీ, పద్మభూషన్, పద్మ విభూషన్, అర్జున అవార్డ్ పొందిన వ్యక్తులకు సన్మానం, అక్టోబర్ 2న మహాత్మా గాంధీజీకి నివాళులు, లాల్ బహదూర్ శాసీ్త్ర చిత్రపటానికి పుష్పాంజలి, ఖాదీ ఉత్పత్తుల కొనుగోలు కార్యక్రమాలను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్గౌడ్, మంగ్య నాయక్, రాజవర్ధన్రెడ్డి, కృష్ణ దితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మపోరాట స్ఫూర్తి ఆదర్శం

చాకలి ఐలమ్మపోరాట స్ఫూర్తి ఆదర్శం