జోరుగా పైరవీలు..! | - | Sakshi
Sakshi News home page

జోరుగా పైరవీలు..!

Jul 17 2025 3:42 AM | Updated on Jul 17 2025 3:42 AM

జోరుగా పైరవీలు..!

జోరుగా పైరవీలు..!

హైదరాబాద్‌కు చేరిన ధాన్యం లారీ పంచాయితీ

లెక్కలు తేల్చడంలో

అధికారుల మీనమేషాలు

అక్రమంగా ధాన్యం తరలిస్తూ పట్టుబడిన క్రమంలో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి తీయడంలో సివిల్‌సప్‌లై శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు. వాస్తవానికి సీజన్ల వారీగా మిల్లులకు కేటాయించిన ధాన్యం, అందుకు సంబంధించి మిల్లులు తిరిగి ఇచ్చిన బియ్యం లెక్కలు ప్రతిరోజు అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుంటారు. అయితే అక్రమంగా దొరికిన ధాన్యం లోడులారీ లెక్కలు తీయడంలో మాత్రం అధికారుల మీనమేషాలు లెక్కిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆన్‌లైన్‌లో అన్ని లెక్కలు ఉన్నా.. విచారణ పేరిట కాలయాపన చేసి సదరు రైస్‌మిల్లు యజమానిని తప్పించే పనిలో సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారుల బిజీగా ఉన్నట్లు బాహటంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా పైరవీల నేపథ్యంలో అవినీతి లెక్కలు బయటకు వస్తాయా.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

కలెక్టర్‌కు ఫిర్యాదు

ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలని నందిన్నెలోని సదరు రైస్‌ మిల్లుకు కేటాయిస్తే.. మిల్లు యజమాని ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడంపై నందిన్నె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రైస్‌ మిల్లు యజమానిపై చర్య తీసుకోవాలంటూ కలెక్టర్‌ బీఎం సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఇదిలాఉండగా, ఈ ఽవ్యవహారంపై విచారణ జరుపుతున్న సివిల్‌ సప్లయ్‌ డీఎస్‌ఓ స్వామిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు.

తాజాగా రాయచూర్‌ సమీపంలోని మిల్లులో 50 వేల బస్తాల ధాన్యం డంప్‌

ధాన్యం లారీ వ్యవహారంలో వెలుగుచూస్తున్న అక్రమాలు

సదరు రైస్‌ మిల్లుకు మూడు సీజన్లలో రూ.45 కోట్ల ధాన్యం కేటాయింపు

మర ఆడించి అందించింది రూ.5 కోట్ల బియ్యమే..

సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్‌/గద్వాల: కేటీదొడ్డిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ధాన్యం లోడు లారీ పంచాయితీ హైదరాబాద్‌కు చేరింది. ప్రభుత్వంలోని కీలకంగా వ్యవహరించే పెద్దను ఆశ్రయించి అక్రమాల నుంచి బయటపడేందుకు రైస్‌మిల్లు యజమాని జోరుగా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ అవినీతి బాగోతంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ సొమ్మును కాజేయడంలో కాకలుతీరిన సదరు రైస్‌మిల్లు యజమాని తనకున్న పలుకుబడితో 2022 రబీ, 2024 ఖరీఫ్‌, 2024–25 రబీ సీజన్లలో సుమారు రూ.45 కోట్ల విలువ గల ధాన్యాన్ని తన మిల్లుకు కేటాయించేలా చేసినా.. ప్రభుత్వానికి తిరిగి 10 శాతం మాత్రమే సీఎమ్మార్‌ బియ్యం అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో సుమారు రూ.5 కోట్ల విలువ గల ధాన్యాన్ని కర్ణాటకలోని రాయచూరు సమీపంలో ఉన్న ఓ రైస్‌ మిల్లులో గుట్టుగా దాచిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

ముడుపులతో కెపాసిటీ పెంపు

నందిన్నెకు చెందిన సదరు రైస్‌మిల్లు యజమాని అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికి జైకొట్టి తన అక్రమ దందా కొనసాగిస్తుంటాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. సాధారణంగా రైస్‌మిల్లుకు ధాన్యం కేటాయించే క్రమంలో అధికారులు మిల్లు కెపాసిటీని పరిగణలోకి తీసుకుంటారు. అయితే, ఈ మిల్లు సామర్థ్యం 6 టన్నులు ఉంటే దానిని 10 టన్నులకి పెంచుకుని పెద్దమొత్తంలో ధాన్యం కేటాయించుకున్నాడు. ఇందులో తనకు సహకరించిన సివిల్‌ సప్లయ్‌ శాఖలోని ఓ కీలక అధికారికి దాదాపు రూ.6 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం.

ప్రభుత్వ పెద్ద వరకు పంచాయితీ

నందిన్నెలోని ఓ రైస్‌మిల్లు యజమాని ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో 400 క్వింటాళ్ల వడ్ల ధాన్యం లారీ అక్రమంగా కర్ణాటకలోని రాయచూరుకు తరలిస్తుండగా.. విషయం తెలుసుకొని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. సదరు రైస్‌ మిల్లు యజమాని ఈ కేసు నుంచి బయటపడేందుకు గద్వాల సివిల్‌సప్‌లై శాఖలోని ఓ అధికారిని మొదట ఆశ్రయం పొందాడు. అయితే, పరిస్థితి సీరియస్‌ కావడంతో అధికార పార్టీకి చెందిన ఓ నేత ద్వారా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఓ పెద్దను ఆశ్రయించినట్లు తెలిసింది. తనపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా హైదరాబాద్‌లో తిష్టవేసి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.

● 2022 రబీలో 1,425.520 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, 2024 ఖరీఫ్‌లో 5,948.560 మెట్రిక్‌ టన్ను లు, 2024–25రబీలో 10,294.680 మెట్రిక్‌ టన్ను లు మొత్తంగా మూడు సీజన్లలో సుమారు రూ.45 కోట్ల విలువ గల (40కేజీల సామర్థ్యం ఉన్న 4 లక్ష ల ధాన్యం బస్తాలు) ధాన్యం సివిల్‌ సప్లయ్‌ శాఖ అ దికారులు సదరు మిల్లుకు కేటాయించారు. ఇందు లో ఇప్పటి వరకు 2024 ఖరీఫ్‌కు సంబంఽధించి 17 ఏసీకేల వరకు, మార్చి 2024–25 రబీకి సంబంధించి 13 ఏసీకేల వరకు బియ్యంగా మార్చి అందించారు. 2022 రబీకి సంబంధించి బియ్యం నేటికీ అందించలేదు. ప్రభుత్వానికి ఇప్పటి వరకు కేవలం రూ.5 కోట్ల విలువ గల బియ్యం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement