ఏటూరునాగారం: మండల కేంద్రానికి చెందిన వావిలాల సంధ్యారాణి చిన్న ఎల్లయ్య దంపతులకు చెందిన కుమార్తె, కుమారుడు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఈ మేరకు వావిలాల సుశీల్ చంద్ర 9111 ర్యాంక్ రాగా అతడికి హైదరాబాద్లోని టీఆర్ఆర్ఎం పటాన్ చెరువులోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. అలాగే వావిలాల శైలూచంద్రికకు 6513 ర్యాంకు రావడంతో నల్గొండలోని నార్కట్పల్లి కామినేని మెడికల్ కళాశాలలో సీటు వచ్చినట్లు తండ్రి ఎల్లయ్య వెల్లడించారు. పేద వర్గాలకు సేవ చేయడానికే తన ఇద్దరు పిల్లలను డాక్టర్లను చదివిస్తున్నట్లు ఎల్లయ్య తెలిపారు. దీంతో వారిని పలువురు అభినందించారు.
‘చిన్నారులకు
పౌష్టికాహారం అందించాలి’
ములుగు: చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు జంక్ఫుడ్కు దూరంగా ఉంచాలని జిల్లా సంక్షేమ అధికారి ఈసంపెళ్లి ప్రేమలత, సీడీపీఓ శిరీష అన్నారు. ఈ మేరకు వారు మండల పరిధిలోని శ్రీరాములపల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎస్.సరస్వతి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు సురేందర్, రామయ్య, వీఓఏ అధ్యక్షురాలు కె.అనిత, ఐసీపీఎస్ సంధ్య, అంగన్ వాడీ టీచర్లు భాగ్య, ఎస్. రమ, రెహనా సుల్తానా, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యతోనే
బంగారు భవిష్యత్
వాజేడు: ఉన్నత విద్యను అభ్యసిస్తేనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి నాయిని వీరేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అడ్మిషన్లు, ఉపన్యాసకుల బోధన తీరును ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం ద్వారా జూనియర్ కళాశాల విద్యార్ధులకు వచ్చిన బ్యాగులు, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ పట్టుదలతో చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్కుమార్, ఉపన్యాసకులు డాక్టర్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


