ఆన్లైన్ లావాదేవీలపై కొత్త నిబంధనలు
ములుగు: చేతిలో నగదు లేకపోయినా.. ఫోన్లో యూపీఐ ఉంటే చాలు.. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు చెల్లింపులన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఇంతగా ప్రజల జీవితంలో భాగమైన యూపీఐపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో ప్రజలు, వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు.
రూ.2 వేలు దాటితేనే..
కొత్త యూపీఐ విధానం ప్రకారం రూ.2 వేలకు పైగా జరిగే నిర్ధిష్ట పర్సన్ టు మెర్చంట్(వ్యక్తి నుంచి వ్యాపారికి) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రైల్వే, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్పుట్స్ వంటి రంగాల్లో రూ. 2 వేలకుపైగా అర్హత కలిగిన లావాదేవీలకు ఒక్కో లావాదేవీపై రూ.5 ఎండీఆర్ ఉంటుంది. రూ.75 వేలకు పైగా సాధారణ అర్హత కలిగిన లావాదేవీలకు ఎండీఆర్ గరిష్టంగా రూ.300లుగా పరిమితం చేశారు. ఈ యూపీఐ విధి విధానాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలో రోజు వారీగా సుమారు రూ.37.20 లక్షలకు పైగా ఆన్లైన్ లావాదేవీలే జరుగుతున్నాయి.
రూ.37.20 లక్షల వ్యాపారం
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామపంచాయతీలు, ములుగు మున్సిపాలిటీ పరిధిలో రోజుకు యూపీఐ లావాదేవీలు సుమారుగా రూ.37.20 లక్షల వ్యాపారం జరుగుతుంది. అంటే దాదాపుగా ప్రతిరోజూ జిల్లాలో జరిగే రూ.37.20 లక్షల వ్యాపారంపై యూపీఐ చార్జీలు సుమారు రూ.11 వేల నుంచి రూ.12 వేలు పడే అవకాశం ఉంది. జిల్లాలో 25 వైన్స్ షాపులు ఉండగా ప్రతిరోజూ సుమారుగా 10 లక్షల వ్యాపారం సాగుతోంది. 19 పెట్రోల్ బంకుల ద్వారా రూ.3.80 లక్షలు, 18 మెడికల్ షాపులు ద్వారా రూ.2 లక్షలు, 15 ఐరన్, ఎలక్ట్రానిక్స్ షాపుల ద్వారా రూ.7.50 లక్షలు వ్యాపారం సాగుతోంది. అదే విధంగా చికెన్, మటన్ దుకాణాల ద్వారా రూ. 1.50 లక్షలు, 340 కిరాణ షాపుల ఉండగా రూ. 3.40 లక్షలు, 42 ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణాల ద్వారా రూ.4 లక్షలు, బట్టల దుకాణాల ద్వారా రూ.3 లక్షలు, హోటల్స్ ద్వారా రూ.2లక్షల వ్యాపారం ఆన్లైన్ లావాదేవీలు కొనసాగుతున్నాయి.
అయోమయంలో ప్రజలు, వ్యాపారులు
వచ్చేనెల 15వ తేదీ నుంచి అమలు
జిల్లాలో రోజు వారీగా రూ.37.20 లక్షల యూపీఐ లావాదేవీలు


