‘ప్రతీ మనిషికి పుట్టుకతోనే హక్కులు’
ములుగు: ప్రతీ మనిషికి పుట్టుకతోనే హక్కులు లభిస్తాయని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సదస్సుకు మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోని మానవ జాతి మొత్తం ఒక కుటుంబం లాంటిదని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నట్టే, గౌరవం సైతం అందించడమే మానవ హక్కుల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, ఉపాధ్యాయులు ఖలీల్, వీరనారాయణ, మమత తదితరులు పాల్గొన్నారు.


