పోలీసుల అదుపులో ఇద్దరు మావోయిస్టులు? | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఇద్దరు మావోయిస్టులు?

May 30 2025 12:59 AM | Updated on May 30 2025 12:10 PM

మరో ఇద్దరి కోసం గాలింపు

ఏటూరునాగారం: ఏటూరునాగారం పోలీసుల అదుపులో ఇద్దరు మావోయిస్టులు ఉండగా మరో ఇద్దరి కోసం పోలీసులు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి మావోయిస్టు డివిజనల్‌ కమిటీ సభ్యులు కొండాయి ప్రాంతం మీదుగా వచ్చినట్లు తెలుస్తోంది. వారిని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరో ఇద్దరి కోసం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి, రాయబంధం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడ ఇంటింటి సోదాలు చేపట్టినట్లు తెలిసింది. ఇటీవల మావోయిస్టు సభ్యులు వరుస అరెస్టులు, లొంగుబాట్ల జరుగుతుండడంతో కొంత మంది మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకు వారి బంధువుల సాయంతో పోలీసులకు లొంగిపోయే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

టేకు కలప స్వాధీనం

వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గురువారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి వంశీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వెంకటాపురం మండల మీదుగా అక్రమంగా రెండు వాహనాల్లో టేకు దిమ్మలను తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆలుబాక గ్రామ సమీపంలో రెండు బొలెరో వాహనాల్లో తరలిస్తున్న 17 టేకు దిమ్మలను పట్టుకున్నట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.6.5లక్షలు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో ఆలుబాక సెక్షన్‌ అధికారి చంద్రమోహన్‌, ఎదిర సెక్షన్‌ ఆఫీసర్‌ జయసింగ్‌, సిబ్బంది ప్రణవి, లాలు, బెస్‌ క్యాంప్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఐఐటీలో రేవంత్‌ ప్రతిభ

ములుగు రూరల్‌: ములుగు మండల పరిధిలోని లాలాయిగూడెం గ్రామానికి చెందిన జాడి రేవంత్‌ ఐఐటీలో ప్రతిభ కనబర్చి ఐఐటీ మద్రాస్‌లో ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో సీటు సాధించాడు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌, మెరిట్‌ సర్టిఫికెట్‌ అందుకున్నారు. జాడి రేవంత్‌ టీజీడబ్ల్యూఆర్‌జేసీ గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివి మొదటి ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రేవంత్‌ ఐఐటీ సీటు సాధించడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు.

ఏర్పాట్లు చేయాలి

భూపాలపల్లి అర్బన్‌: జూన్‌ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం జీఎం ఏరియా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సింగరేణి ఆధ్వర్యంలో జూన్‌ 2న మిలీనియం క్వార్టర్స్‌లో కాకతీయ క్రీడా మైదానంలో వేడుకలను నిర్వహించున్నట్లు తెలిపారు. సింగరేణి యాజమాన్యం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా స్టాల్స్‌, ఫొటో గ్యాలరీ, తెలంగాణ రన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌వోటుజీఎం కవీంద్ర, అధికారులు ఎర్రన, జోతి, రవికుమార్‌, మారుతి, మురళిమోహన్‌, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పని గంటలు పెంచాలి

భూగర్భ గనుల్లో ఎస్‌డీఎల్‌ యంత్రాల పని గంటలను పెంచాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై గురువారం ఏరియాలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేసి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సంస్థ నిర్దేశించిన ప్రకారం లక్ష్యాలను సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని కోరారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని అధికారులు, ఉద్యోగులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, భిక్షమయ్య, వెంకటరమణ, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement