
మేడారంలో శాశ్వత పనులు
మంత్రి సీతక్క చొరవతో అభివృద్ధి పనులు షురూ
నిర్మాణం పూర్తయిన పూజారుల భవనం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో శాశ్వత నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణ పనులపై అధికారులు దృష్టిసారించారు. వచ్చే మహాజాతర నాటికి ముందస్తుగా శాశ్వత అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిధుల కేటాయింపు కోసం ప్రభుత్వానికి ప్రణాళికలు నివేదించిన అనంతరం మంత్రి సీతక్క అభివృద్ధి పనులకు నిధులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు.
రూ. 8 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం
ఊరట్టం నుంచి కాల్వపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులను మంజూరు చేసింది. పీఆర్శాఖ ఆధ్వర్యంలో ఊరట్టం నుంచి కాల్వపల్లి వరకు ఆరు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించారు. ప్రస్తుతం రోడ్డు ఫార్మేషన్ పనులు సాగుతున్నాయి. బీటీ రోడ్డు నిర్మాణంతో మహాజాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థంగా ఉంటుంది. అలాగే మేడారంలో రూ.2 కోట్లతో వనం రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ప్రతీ ఏటా మహాజాతర సమయంలో పూజారులు ఎల్బాక అటవీ ప్రాంతం నుంచి కంకవనాన్ని గద్దైపెకి తీసుకువస్తారు. ఈ రోడ్డు పైనుంచి సమ్మక్క పూజారులతోపాటు వందల సంఖ్యలో ఆదివాసీ యువత వనం తీసుకువస్తారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణంతో ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
చకచకా క్యూలైన్ షెడ్ల నిర్మాణ పనులు
భక్తుల క్యూలైన్లపై రూ.3.80 కోట్లతో షెడ్ల నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. క్యూలైన్ల్లో జాతర సమయంలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇబ్బందులు పడకుండా శాశ్వతంగా ఉండేలా జీఐ షీట్స్తో షెడ్లు నిర్మించనున్నారు. మహాజాతరకు ముందుగానే పనులు పూర్తయ్యేలా అధికారులు ఆదేశాల మేరకు ప్రణాళిక బద్ధంగా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. క్యూలైన్లపై షెడ్ల నిర్మాణంతోపాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిధుల మంజూరుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది.
పూజారుల భవనం పూర్తి
మేడారంలో పూజారుల భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పూజారుల కోసం అన్ని హంగులతో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భవనాన్ని నిర్మించారు. రెండు అంతస్తుల భవనంలో 16 రూంల నిర్మాణంతోపాటు సమావేశాలు నిర్వహించేందుకు మీటింగ్ హాల్ కూడా నిర్మించారు. ఈనెల 29న మంత్రి సీతక్క చేతుల మీదుగా భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయగా వాయిదా పడింది. త్వరలో భవనాన్ని ప్రారంభించి పూజారులకు కేటాయించనున్నారు. భవన నిర్మాణంతో పూజారులు విశ్రాంతి తీసుకునే సమస్య కూడా తీరింది.
మరికొన్ని పనులకు ప్రతిపాదనలు సిద్ధం
మహాజాతరకు ముందుగానే
నిర్మాణాల పూర్తికి కసరత్తు
మంత్రి సీతక్క చొరవతో..
మంత్రి సీతక్క చొరవతో ఎన్నడూ లేని విధంగా శాశ్వత నిర్మాణ పనులు చేపడుతున్నారు. అన్ని మార్గాల నుంచి భక్తులు మేడారానికి చేరుకునేలా రోడ్ల నిర్మాణ పనులపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే రూ.12కోట్లతో రోడ్ల నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం రూ.10 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. మహాజాతరకు ఇంకా 8 నెలల సమయం మాత్రమే ఉంది. ఈసారి జాతరలో హడావుడిగా పనులు చేయకుండా ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. శాఖల వారీగా త్వరలో నిధులు మంజూరు కాగానే మరిన్ని శాశ్వత నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు సమాచారం. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మేడారంలో శాశ్వత తాగునీటి కోసం ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. నిధులు మంజూరు చేయగానే ఆ పనులు కూడా చేపడుతామని ఉన్నతాధికారులు తెలిపారు.

మేడారంలో శాశ్వత పనులు