
అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచుతా..
భూపాలపల్లి రూరల్: రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని 8, 27 వార్డులైన జవహర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బీమ్, జై బాపూ, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా కాలనీలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ నిధులు రూ.2 లక్షల వ్యయంతో వేసిన మంచి నీటి బోరు మోటారును ప్రారంభించారు. అదే కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొడ్డు బియ్యం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు ప్రజా ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్, టీపీసీ సభ్యులు మధు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు