మిల్కీ బ్యూటీ తమన్నాకు ఐటమ్ సాంగ్స్ కొత్తేమి కాదు. హీరోయిన్గా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె ప్రత్యేక పాటలలో మెరిసింది. ఇప్పుడు కూడా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరో పక్క స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది.‘స్త్రీ-2’ చిత్రంలో తమన్నా చేసిన ‘ఆజ్ కి రాత్’ ప్రత్యేక గీతం ఇప్పటికీ యూట్యూబ్లో దూసుకెళ్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఐటమ్ సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అది కూడా మాములు ఐటం సాంగ్ కాదు బాలీవుడ్లో ఒకప్పుడు సంచలనం సృష్టిస్తున్న చోలీ కేఛే క్యా హై’ రీమేక్ సాంగ్కి తమన్నా స్టెప్పులేయబోతుంది.
సంజయ్ దత్ కల్ట్ క్లాసిక్ ఖల్ నాయక్ సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ పేరుతో ఇది తెరకెక్కనుంది. ‘ఖల్ నాయక్’లోని ‘చోళీ కే పీచే క్యా హై’ పాట అప్పట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. మాధురీ దీక్షిత్ వేసిన స్టెప్పులకు యువత ఫిదా అయింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాటలోని స్టెప్పులు ఎంత వైరల్ అయ్యాయో.. లిరిక్స్ కూడా అంతే వివాదానికి దారి తీశాయి. డబుల్ మీనింగ్ లతో కూడిన లిరిక్స్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. అయినప్పటికీ ఈ పాట సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ పలు పార్టీలలో ఈ పాట వినపడుతూనే ఉంటుంది.
అలాంటి సూపర్ హిట్ ఐటం సాంగ్ని ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ కోసం రీమేక్ చేయబోతున్నారట. ఆ పాటకు తమన్నా అయితేనే న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సాంగ్ రీమిక్స్ పై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఫైనల్ కాస్టింగ్ ఇంకా లాక్ కాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ, తమన్నా పేరు బలంగా వినిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.


