
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఆమె చివరిసారిగా మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. అయితే సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటోంది. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటోంది. ముఖ్యంగా వన్యప్రాణుల విషయంలో పోరాటం చేస్తోంది. అలాగే మూగజీవాలను ఎవరైనా హింసించినా వెంటనే సోషల్ మీడియా రియాక్ట్ అవుతుంది రేణు దేశాయ్.
ఇదిలా ఉంచితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్గా మారింది. పవన్ కల్యాణ్ అభిమాని కామెంట్ చూసిన రేణు దేశాయ్.. తనదైన స్టైల్లో ఇచ్చిపడేసింది. మీ పక్కన పవన్ కల్యాణ్ కాకుండా మరొకరిని ఊహించుకోలేమని అభిమాని ఇన్స్టాలో కామెంట్ చేశాడు. ఇది చూసిన రేణు దేశాయ్ సుదీర్ఘమైన పోస్ట్తో దిమ్మదిరిగేలా రిప్లై ఇచ్చింది.
రేణు దేశాయ్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఈ అబ్బాయి/అమ్మాయి కొంతవరకు చదువుకున్న వారిలా ఉన్నారు. అందుకే స్మార్ట్ఫోన్లో సొంత ఇమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుని.. తన పోస్ట్పై కామెంట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించినట్లున్నాడు. మనమందరం ఇప్పుడు 2025లో ఉన్నాం. కానీ పితృస్వామ్యం ఎంతగా పాతుకుపోయిందంటే.. నేటికీ చాలా మంది ప్రజలు ఆమెకు స్వంత స్వేచ్ఛా సంకల్పం లేకుండా స్త్రీ కేవలం తండ్రి లేదా భర్త ఆస్తి అని నమ్ముతారు. . నేటికీ మహిళలకు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అనుమతి అవసరం. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు స్త్రీ స్థానం వంట చేయడం, పిల్లలకు జన్మనివ్వడం వంటగదికే పరిమితమని భావిస్తారని' కౌంటరిచ్చింది.
రేణు దేశాయ్ ఇంకా రాస్తూ.. 'నేను ఇలాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా.. నా స్వరం వినిపించడానికి.. నా స్నేహితులు, అనుచరులు నా గురించి ఏమనుకుంటారో అని భయపడకుండా ఉండటానికి ఇష్టపడతాను. భవిష్యత్ తరాల మహిళల కోసం మార్పులకు మార్గం సుగమం చేయడానికి ఒక స్త్రీగా, ఒక ఆడపిల్ల తల్లిగా నా వంతు కృషి చేస్తున్నా. స్త్రీవాదం అంటే వారాంతాల్లో తాగి తిరగడం కాదు.. మహిళలను పశువులు, ఫర్నిచర్లా చూసే ప్రాథమిక మనస్తత్వం ఉన్న మూలాలను ప్రశ్నించడం! రాబోయే కొద్ది తరాల్లోనే స్త్రీలు విశ్వంలో తమదైన ఉన్నత స్థానాన్ని కనుగొంటారని.. తల్లి గర్భంలో స్త్రీగా పుట్టినందుకు, పరువు హత్యలు, వరకట్న మరణాల కోసం చంపబడరని ఆశిస్తున్నా' అని తనపై కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ అభిమానికి ఘాటుగానే ఇచ్చిపడేసింది.
కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు.