బాలీవుడ్ నటి రవీనా టండన్ సోదరుడి ఇంట్లో గతేడాది అక్టోబరులో దొంగతనం జరిగింది. దాదాపు రూ.25 లక్షలు విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, ఖరీదైన చేతి వాచీలు చోరీ చేసిన కేసులో 47 ఏళ్ల మహిళని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళని రాశి ఛాబ్రియాగా గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఈమె.. రవీనా తల్లి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటోంది.
(ఇదీ చదవండి: 'బ్లాస్ట్' సినిమా ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా)
ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబరులో రవీనా కుటుంబ సభ్యులు, ఇంట్లోని లాకర్ పరిశీలించగా అది తెరిచి ఉంది. అలానే బంగారం, వజ్రాల ఆభరణాలు, రెండు కాస్ట్ లీ చేతి వాచీలు కనిపించలేదు. వీటి మొత్తం విలువ రూ.25 లక్షలు అని అంచనా వేశారు. దీంతో రాజీవ్ టండన్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. తొలుత రాశి ఛాబ్రియాని ప్రశ్నించగా.. దొంగతనం ఆరోపణలని ఖండించింది. తర్వాత నేరాన్ని ఒప్పుకొందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
అయితే రెండు చేతి గడియారాలని తిరిగి ఇచ్చేసినప్పటికీ.. ఆభరణాలని మాత్రం జగదీష్ అనే వ్యక్తి దగ్గరున్నాయని చెప్పింది. ఎన్నిసార్లు అడిగినా అవి ఇవ్వకపోయేసరికి పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. 2020 నుంచి రవీనా టండన్ సోదరుడి కుటుంబానికి బాగా దగ్గరైన రాశి.. ఇంట్లోని రెండో అంతస్తులో విలువైన ఆభరణాలు ఉంచే చోటుకి కూడా స్వేచ్ఛగా వెళ్లగలిగేంత నమ్మకం సంపాదించింది. తర్వాత అదును చూసి వాటిని దొంగిలించింది.
అయితే పోలీసులకు దొరికిపోయిన తర్వాత తన సహచరుడిని పోలీస్ ఇన్ఫార్మర్గా టండన్ కుటుంబానికి పరిచయం చేసిన రాశి.. ఆభరణాల సంగతి వదిలేయకపోతే ఫేక్ డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని కూడా బెదిరించింది. ఇదే విషయాన్ని రాజీవ్ టండన్ తన ఫిర్యాదులోనూ పేర్కొన్నారు. గత నెల 21న రాశి ఛాబ్రియాని అరెస్ట్ చేసిన జుహు పోలీసులు, ఆమెని కోర్టులో హాజరుపరచగా గత నెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
రవీనా టండన్ గతంలో తెలుగులో హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈమె కూతురు రషా తడానీ.. మహేశ్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా నటిస్తున్న 'శ్రీనివాస మంగాపురం' మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)


