పాన్ ఇండియా అనే పేరు చెప్పి.. చాలామంది హీరోలు, దర్శకులు ఏళ్లకు ఏళ్లు వృథా చేస్తున్న కాలమిది. పోనీ కంటెంట్తో ఏమైనా హిట్ కొడుతున్నారా? అంటే లేదు. హడావుడి తప్పితే ఏం ఉండట్లేదు. చాలా తక్కువమంది మాత్రమే ప్రేక్షకుల అంచనాలని అందుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ ట్రెండ్ని సృష్టించిన రాజమౌళి.. ఇప్పుడు ఎవరి ఊహలకు అందని విధంగా నమ్మలేని పనులన్నీ చేస్తున్నాడు. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)
సాధారణంగా సినిమా చేస్తున్నాం అంటే షూటింగ్ ప్రారంభానికి ముందే టీమ్ నుంచి ప్రకటన వస్తుంది. లాంచింగ్ లాంటి హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ట్రెండ్ని బ్రేక్ చేసిన రాజమౌళి.. అసలు చిత్రీకరణ మొదలైన విషయాన్నీ చాన్నాళ్లు దాచిపెట్టాడు. షూటింగ్ అప్డేట్ లాంటివి అస్సలు బయటపెట్టలేదు. సోషల్ మీడియాలో ఎన్ని రూమర్స్ వచ్చినా ఒక్కటంటే ఒక్కదానిపై కూడా స్పందించలేదు. గతేడాది నవంబరులో వేరే లెవల్ అనే రేంజులో ఈవెంట్ ఏర్పాటు చేసి 'వారణాసి' గురించి ప్రకటించాడు. ఇదేదో రెగ్యులర్ ఫార్మాట్ అయితే కాదు.
మూవీ ఎలా ఉండబోతుందనేది మూడు నిమిషాల వీడియో రూపంలో చూచాయిగా చెప్పేసిన దర్శకుడు రాజమౌళి.. అందరి అంచనాలు పెంచేశాడు. ఇదే ఈవెంట్లో సినిమా గురించి చాలానే విషయాలు బయటపెట్టాడు. చిత్రం పూర్తయ్యే వరకు ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా కట్టుదిట్టం చేసే జక్కన్న.. ఇలా మారిపోవడం ఎవరూ ఊహించలేదు. ఇదే కార్యక్రమంలో కీరవాణి మాట్లాడుతూ 2027 వేసవిలో 'వారణాసి'.. థియేటర్లలోకి రావొచ్చని అన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 7న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))
చాలామంది దర్శకనిర్మాతలు ఒక అప్డేట్ ఇస్తున్నారంటే.. ఫలానా టైమ్కి ఓ సర్ప్రైజ్ ఉందని ఓ అప్డేట్, దీనికి మరో అప్డేట్ అని చెప్పి నెటిజన్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. రాజమౌళి మాత్రం ఉరుము లేని పిడుగులా.. కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. దీంతో అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే జక్కన్న సినిమా అంటే చెప్పిన టైంకి రాదు, వాయిదా పడుతుందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ 'వారణాసి' విషయంలో అంతా పకడ్బందీగానే ఉన్నట్లయితే కనిపిస్తుంది.
ఎందుకంటే ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వరకే పరిమితం. ఈసారి మాత్రం అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాలని అనుకుంటున్నాడు. చెప్పిన టైంకి రాకుండా వాయిదాల్లాంటివి మన దగ్గర కుదురొచ్చు. ఎందుకంటే ఇది మనకు అలవాటైపోయింది కాబట్టి. కానీ గ్లోబల్ రేంజులో రిలీజ్ అన్నప్పుడే మాటమీద నిలబడాల్సి ఉంటుంది. లేదంటే బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఈ లెక్కలన్నీ వేసుకునే రాజమౌళి.. గతంలో చేసినట్లు కాకుండా ఈసారి డిఫరెంట్ అప్రోచ్ ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది. అంతా చూస్తున్న సగటు తెలుగు ప్రేక్షకుడు.. రాజమౌళిని నిజంగానే నమ్మొచ్చా అని మాట్లాడుకుంటున్నాడు.
(ఇదీ చదవండి: 'ధురందర్' లాంటి హిట్ తర్వాత శంకర్ తోనా?)


