
అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘మోతేవరి లవ్స్టోరీ’. ఈ సిరీస్ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్గా తెరకెక్కిన ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ ఆగస్ట్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్కు సంబంధించిన పోస్టర్ను మేకర్లు రిలీజ్ చేశారు. నటుడు ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్, టైటిల్ను అధికారికంగా ఆవిష్కరించారు.
లంబాడిపల్లి అనే గ్రామంలోని ఇద్దరు సోదరులు, స్వర్గస్తులైన తండ్రి ఓ మహిళకు రాసిచ్చిన ఐదు ఎకరాల భూమి, రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్ జీలా) జంట, ఈ భూ వివాదం, కుటుంబ గర్వం, వారసత్వం మధ్య సాగే ఈ సిరీస్ ఆద్యంతం అందరినీ అలరించేలా ఉంటుంది. ఈ ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ టైటిల్, పోస్టర్ రిలీజ్ అనంతరం..
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ .. ‘నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా.. చిన్న సిరీస్, పెద్ద సిరీస్ అని అనడం నాకు నచ్చదు. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే టైటిల్, పోస్టర్ చాలా కొత్తగా ఉంది. నాకు ఇలా ఈవెంట్లకు రావడం కాస్త భయం. కానీ అనిల్ పిలిచిన వెంటనే రావాలని అనిపించింది. నేను యూఎస్లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి వారు మై విలేజ్ షో కంటెంట్ను చూసేవాళ్లు. నేను కూడా ఫాలో అయ్యేవాడ్ని. మధుర శ్రీధర్ గారు నా దొరసాని సినిమాను నిర్మించి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ మూవీకి మై విలేజ్ షో కంటెంట్ చూసే డైలాగ్స్, యాసను నేర్చుకున్నాను. నా జర్నీలో మై విలేజ్ షో టీం పాత్ర చాలా ఉంది. ఈ సిరీస్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పెద్ద సక్సెస్ రావాలి. ఈ సిరీస్కు సీక్వెల్స్ వస్తూనే ఉండాలి. సక్సెస్ అవుతూనే ఉండాలి’ అని అన్నారు.
అనిల్ జీలా మాట్లాడుతూ ..‘మా ‘మై విలేజ్ షో’ టీం నుంచి మొదటి సారిగా ఇలా సిరీస్ చేశాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్కే కథను ఓకే చేశారు. జీ5 టీం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. మేం ఇప్పటి వరకు ఎన్నో సార్లు చూశాం. ఆద్యంతం నవ్వుకుంటూనే ఉన్నాం. నన్ను విజయ్ దేవరకొండ అన్ననే సినిమాల్లోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు నా కోసం వచ్చిన ఆనంద్ అన్నకి థాంక్స్. మా సిరీస్ ఆగస్ట్ 8న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.