అహ్మదాబాద్ ఘటన.. ఎయిరిండియాపై ప్రియాంక చోప్రా సిస్టర్‌ ఆగ్రహం! | Meerraa Chopraa Demands Refund For Cancelling Air India Flight Over Safety Concerns | Sakshi
Sakshi News home page

Meera Chopra: అహ్మదాబాద్ ఘటన.. ఎయిరిండియాపై తీరుపై మీరా చోప్రా ఫైర్!

Jun 13 2025 3:27 PM | Updated on Jun 13 2025 3:51 PM

Meerraa Chopraa Demands Refund For Cancelling Air India Flight Over Safety Concerns

అహ్మదాబాద్ విమానం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. మనిషి ప్రాణాలు పోవడానికి ఒక్క సెకను చాలు అనేది కళ్లముందు కనిపిస్తోంది. ఈ విషాద ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటేనే ఆలోచించే పరిస్థితి ఎదురవుతోంది. విమాన ప్రయాణం ఇంత విషాదంగా మారడంతో భద్రతపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు టికెట్స్‌ రద్దు చేసుకున్నారు. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్‌ మీరా చోప్రా భర్త కూడా ఉన్నారు. ఆమె భర్త ఈనెల 15న దుబాయ్‌కు ఎయిరిండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతపై నమ్మకం లేకపోవడంతో టికెట్‌ రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మీరా చోప్రా తెలిపింది. అయితే ఎయిరిండియా తమ టికెట్‌ డబ్బులను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించిందని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఎయిర్‌లైన్స్ సిబ్బంది తీరుపై మీరా చోప్రా తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది.

మీరా చోప్రా ట్వీట్‌లో రాస్తూ.. 'ఎయిరిండియా తీరు చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్‌కు ప్రయాణించాల్సి ఉంది. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో మేము ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నాం. కానీ ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సలహా రాలేదని పేర్కొంటూ టికెట్‌ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. ఎయిర్ ఇండియాను నడపడంలో మేమందరం గర్వపడ్డాం. ఎందుకంటే ప్రముఖ టాటా గ్రూప్ నడుపుతున్న మన జాతీయ విమానయాన సంస్థ. కానీ ఈ రోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఇప్పుడు వారు విమానాలు ఎలా నిర్వహిస్తున్నారో తీవ్ర నిరాశపరిచింది. ఈ ఘటన వారికి సిగ్గుచేటు. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎయిరిండియా వీటిని అస్సలు పట్టించుకోదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే మీరా చోప్రా టికెట్‌ రీఫండ్ చేయమని అడగడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు.  టికెట్ రద్దు విధానాన్ని ముందుగా చదుకోవాలని ఆమెకు సలహాలిచ్చారు. నిబంధనల ప్రకారం మీరు విమాన సమయాన్ని మార్చినట్లయితే రద్దు చేసి డబ్బులిస్తారని ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు.  నిబంధనలకు విరుద్ధంగా  మీ సొంత కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మరో నెటిజన్‌ మీరాకు కౌంటరిచ్చారు. కాగా.. గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఒక్కరు మినహా 241 అందరూ ప్రాణాలు కోల్పోయారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement