టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తన కలల ప్రాజెక్ట్ ‘హిరణ్యకశ్యప’ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే సినీ సర్కిల్లో మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయ్యాడని.. అందుకే గుణశేఖర్ తప్పుకున్నట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాదు హిరణ్యకశ్యప చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ రూమర్లపై గుణశేఖర్ స్పందించారు. బడ్జెట్ ఎక్కువతుందనే కారణంతోనే సినిమా నుంచి తప్పుకున్నానని.. త్రివిక్రమ్తో దీనికి ఎలాంటి సంబంధం లేదన్నాడు. అంతేకాదు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదని స్పష్టం చేశాడు. ఈ రూమర్స్కు చెక్ పెట్టేందుకు తానే స్వయంగా త్రివిక్రమ్కు ఫోన్ చేసినట్లు తెలిపారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హిరణ్యకశ్యప చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారనే పుకార్లు నా వరకు వచ్చాయి. దీంతో వెంటనే నేను త్రివిక్రమ్కి ఫోన్ చేసి అడిగాను. దానికి ఆయన స్పందిస్తూ.. కేవలం రైటింగ్ (కథ,మాటలు) విభాగంలో మాత్రమే తాను ఉన్నానని.. దర్శకత్వం వహించే ఆలోచన లేదని చెప్పాడు’ అని గుణశేఖర్ అన్నారు. ఇక తాను ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కూడా వివరించాడు.
ఈ నిమాను నిర్మించేందుకు మొదట ఫాక్స్ స్టూడియోస్, డిస్నీ వంటి ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ కథను అనుకున్న రీతిలో వెండితెరపై చూపించాలంటే దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ అవసరమవుతుందని లెక్కలు తేలాయి. అప్పుడు డిస్నీ లాంటి సంస్థలు కూడా వెనక్కు తగ్గాయి. బడ్జెట్ పరిమితులు, ఆచరణాత్మక ఇబ్బందుల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని వచ్చింది అని గుణశేఖర్ స్పష్టం చేశాడు.


