టీఎఫ్‌సీసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి: చిరంజీవి | Chiranjeevi on Percentage Sharing Controversy: Tollywood | Sakshi
Sakshi News home page

టీఎఫ్‌సీసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి: చిరంజీవి

May 26 2026 12:17 AM | Updated on May 26 2026 12:17 AM

Chiranjeevi on Percentage Sharing Controversy: Tollywood

సునీల్, అల్లు అరవింద్, చిరంజీవి, సురేష్‌బాబు, కేఎల్‌ నారాయణ, ‘దిల్‌’ రాజు

‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి ‘తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ (టీఎఫ్‌సీసీ) అన్నది హయ్యెస్ట్‌ బాడీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. థియేటర్స్‌లో పర్సెంటేజీ విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీడియా ముందు ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలు వ్యక్తపరచటం తగదు. ఇలాంటివాటి వల్ల ఇండస్ట్రీ ఒక్కటిగా లేదన్న సందేశం ఇవ్వకూడదు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం అందరికీ  సముచితం’’ అని హీరో చిరంజీవి తెలిపారు. 

మల్టీప్లెక్స్‌లోలా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో కూడా పర్సెంటేజీ విధానం అమలు చేయాలంటూ ఎగ్జిబిటర్స్‌ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో నెలకొన్న సంక్షోభాన్ని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సోమవారం చిరంజీవిని కలిసి, వివరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’(టీఎఫ్‌సీసీ) ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పనితీరు, ఫలితాల పట్ల కొందరు ఎగ్జిబిటర్స్‌లో అసంతృప్తి, అపనమ్మకం ఉందన్న విషయం అర్థం అయింది.

ఫిల్మ్‌ చాంబర్‌ కమిటీ జూన్‌ 30వ తేదీ వరకూ అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించి,ప్రోడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజీ మోడల్‌ మీద ప్రతిపాదనని చేస్తుందనే నమ్మకం నాకు ఉంది. కమిటీ సకాలంలో నివేదిక ఇవ్వటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను’’ అని పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సురేష్‌బాబు, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ‘దిల్‌’ రాజు, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు శేఖర్, నిర్మాతలు అల్లు అరవింద్, కేఎల్‌ నారాయణ, సునీల్‌ నారంగ్‌తో పాటు భరత్‌ నారంగ్, అనుపమ్, శ్రీధర్, సదానంద్‌ గౌడ్, రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement