కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాటిని రీరిలీజ్ చేసినా, సీక్వెల్ తీసినా చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలా యుగానికి ఒక్కడు (ఆయిరత్తిల్ ఒరువన్) సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కార్తీ హీరోగా, ఆండ్రియా జెర్మియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే దర్శకుడు ప్రకటించాడు.
ఆషామాషీ కాదు
కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా పనులు జరగలేదు. గతేడాది చివర్లో మరోసారి సీక్వెల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సెల్వ. ధనుష్, కార్తీతో కలిసి సీక్వెల్ తీస్తానని, కాకపోతే ఏడాదిపాటు వారు కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. ఇప్పటికే చేతిలో సినిమాలతో బిజీగా ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు ఏడాదిపాటు డేట్స్ ఇవ్వాలంటే ఆషామాషీ కాదు. అదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి!
సీక్వెల్లో నేనుండను
ఇకపోతే యుగానికి ఒక్కడు సీక్వెల్పై నటి, సింగర్ ఆండ్రియా జెర్మియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యుగానికి ఒక్కడు సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆ మూవీ నటిగా ఎదిగేందుకు తోడ్పడింది. అయితే రెండో భాగంలో నేను ఉంటానని మాత్రం ఊహించకండి. యుగానికి ఒక్కడు సీక్వెల్ తెరకెక్కితే సంతోషమే కానీ నేను మాత్రం అందులో చేయలేను.
ఆయనతో పని చేయడం కష్టం
ఎందుకంటే మొదటి భాగమే 200 రోజులు తెరకెక్కించారు. అన్ని రోజులు పని చేయడమంటే మాటలు కాదు. అక్కడ అంత కష్టపడ్డాను గనుకే తర్వాత చేసిన సినిమాలు ఎంతో సులువుగా అనిపించాయి. ఏదేమైనా దర్శకుడు సెల్వరాఘవన్తో కలిసి పని చేయడం చాలా కష్టం అని పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రియా చేతిలో మనుషి, పిశాచి 2, నో ఎంట్రీ సినిమాలున్నాయి.


