
ఆండ్రియా( Andrea Jeremiah) అంటే నటి మాత్రమే కాదు.. అంతకు మించి. గాయని, రచయిత్రి.. వీటన్నింటికీ మించి బోల్డ్ నటి. ఏ తరహా పాత్రనైనా చేయడానికి వెనుకాడని డేరింగ్ బ్యూటీ అంటూ కోలీవుడ్లో గుర్తింపు ఉంది. ఈమె పలు భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న ఆండ్రియా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ భామ అన్నది గమనార్హం. ఈమె 2014లో నటించిన పిశాచు చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్కు దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు విజయ్సేతుపతి క్యామియో పాత్రను పోషించిన ఈ చిత్రంలో నటి పూర్ణ, సంతోష్ ప్రతాప్, నమితా కృష్ణమూర్తి, అజ్మల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
రాక్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మురుగానందం నిర్మించిన ఈ చిత్రం చాలా కాలం క్రితమే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని సమస్యల కారణంగా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పైగా పిశాచు–2 చిత్రంలో ఆండ్రియా నటన ఆదుర్స్ అంటూ దర్శకుడు మిష్కిన్ ప్రచారం చేశారు. అయితే గత మూడేళ్లుగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కాగా ఈ చిత్రం విడుదల గురించి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి ఆండ్రియాను అడగ్గా తాను నటించడం మాత్రమే చేయగలను కానీ చిత్రాన్ని రిలీజ్ చేయగలనా? అని ప్రశ్నించారు.
అలాగే తానే నిర్మాతనైనే పిశాచు చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేసేదాన్ని అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా నటి ఆండ్రియా నటించిన మనుషీ చిత్రం కూడా వివాదాల్లో చిక్కుంది. ప్రస్తుతం ఈ భామ నో ఎంట్రీ, మాస్క్ చిత్రాల్లో నటిస్తున్నారు.
పిశాచు–2 ఆలశ్యానికి కారణం ఏంటి
ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ అనే సంస్థ ‘పిశాచి–2’ విడుదలను అడ్డుకుంది. సినిమా హక్కుల విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ రాక్ఫోర్ట్ బ్యానర్ వారు తమకు రూ. 4.85 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చట్టపరమైన వివాదాలతో పాటు ఈ సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించినట్లు దర్శకుడు మిష్కిన్ వెల్లడించారు. అయితే, ఈ సన్నివేశాలను పూర్తిగా చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు చెప్పారు. ఈ అంశం కూడా సినిమాపై వివాదాన్ని పెంచింది.