కుమార్తెతో కలిసి కాన్స్ వెళ్లిన ఐశ్వర్య
వెలుగులోకి ఆండ్రియా డెల్ వాల్ పై దాడి
రెండు దశాబ్దాలకు పైగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు అవుతున్నారు ఐశ్వర్యా రాయ్. అయితే ఈసారి పాల్గొనరనే ప్రచారం సాగింది. కానీ ఇది అవాస్తమన్నట్లుగా ఐశ్వర్యా రాయ్ శుక్రవారం ఫ్రాన్స్లో ల్యాండ్ అయ్యారు. 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె రెడ్ కార్పెట్పై నడిచారు. కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ చిత్రోత్సవాలకు వెళ్లారామె. నేటితో (మే 23) ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఈ ముగింపు వేడుకల్లోనూ ఐష్ మెరవనున్నారు.
దారుణ ఘటన: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగిన ఓ దారుణ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘మిస్ వెనెజులా – 2025’ కిరీటాన్ని దక్కించుకున్న ప్రముఖ మోడల్ ఆండ్రియా డెల్ వాల్ పై ఆమె స్టైలిస్ట్ లగూనా దాడికి పాల్పడ్డాడు. మంగళవారం కాన్స్లోని ఒక హోటల్ గదిలో జరిగిన ఈ దారుణ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘లగూనా నాకు చేసిన పని ఇదే.
అతడు నిజంగా ఎలాంటి వ్యక్తో చెప్పడానికి ఇది చాలు. లగూనా నిజస్వరూపం బయటపడింది’ అంటూ ఆండ్రియా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె ముఖంపై రక్తం ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ ఫ్యాషన్ ఈవెంట్కు సిద్ధం అవుతున్నప్పుడు ఆండ్రియా, లగూనాల మధ్య వాగ్వాదం జరిగిందట. ఈ క్రమంలోనే ఆమెపై లగూనా దాడి చేశారని టాక్.


