● వినియోగదారులు సంయమనం పాటించాలి ● మెదక్ ఆర్డీఓ రమాదేవి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలున్నాయని, వినియోగదారులు ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని ఆర్డీఓ రమాదేవి కోరారు. మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ పంపును మంగళవారం సందర్శించారు. అదే సమయంలో 12,000 లీటర్ల ఆయిల్ ట్యాంకర్ (8000–పెట్రోల్, 4000–డీజిల్) బంకుకు చేరుకుంది. ప్రస్తుతం పెట్రోల్ 29,232 లీటర్లు, డీజిల్ 26,667 లీటర్లు నిల్వ ఉన్నాయని తెలిపారు. అనంతరం మెదక్ మండలం రాజ్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ పరిశీలించారు. గన్నీ సంచుల వివరాలు, తాగునీటి సౌకర్యం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇప్పటివరకు 1,200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సిబ్బంది తెలిపారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. ఆమె వెంట మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబు ఉన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీఓ
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని రాజ్పల్లిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ రమాదేవి మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న గన్నీబ్యాగులు, మౌలిక వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


