మెదక్ కలెక్టరేట్: ప్రజలంతా సెల్ప్ ఎన్యుమరేషన్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా జనగణన డిజిటల్ నమోదు ప్రారంభమైన సందర్భంగా మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో స్వయంగా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడం వల్ల ప్రజల సమయం ఆదా అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. మే 11వ తేదీ నుంచి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఆ సమయంలో ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన వారు నమోదు సమయంలో పొందిన ఐడీ నంబర్ తెలియచేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐడీ నంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ బాధ్యతతో పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


