మెదక్ కలెక్టరేట్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్కు పునాది వేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బాలల భద్రత– రక్షణ, మాదకద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారాన్ని పురస్కరించుకొని సోమవారం బాలల హక్కుల దర్శని ఎగ్జిబిషన్ను ప్రారంభించి మాట్లాడారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలల భద్రత, మత్తు పదార్థాల నివారణలో జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలన్నారు. అనంతరం పోలీస్శాఖ ఆధ్వర్యంలో బాలికలకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి హేమాభార్గవి, ఆర్టీసీ డీఎం సురేఖ, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్డీఓ రమాదేవి, సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాశ్రావు ఆధ్వర్యంలో పీఎం ఇంటర్న్షిప్ వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
హవేళిఘణాపూర్(మెదక్): ధాన్యం కొనుగోలును అధికారులు పర్యవేక్షించి వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామని, తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లను గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై మేనేజర్ జగదీశ్ ఉన్నారు.


