హంగ్లో కింగ్ ఎవరు?
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భిన్నమైన తీర్పు వెలువడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు టెన్షన్ మొదలైంది. అధికారానికి అడుగు దూరంలో ఉన్న మ్యాజిక్ ఫిగర్ను చేరేందుకు విపక్ష నేతల మద్దతు అనివార్యమైంది. నిత్యం కత్తులు దూసుకునే నేతలు.. అధికారం కోసం జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారోనన్న ఉత్కంఠభరితంగా మారింది. – మెదక్జోన్
మెదక్లో 32 వార్డులకు గాను, 15 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా, కాంగ్రెస్ 14 వార్డులను కై వసం చేసుకుంది. బీజేపీ 2, బీఎస్పీ 1 చొప్పున గెలిచాయి. కాగా ఫలితాలు వెలువడిన వెంటనే బీఎస్పీ అభ్యర్థి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్కు, బీఆర్ఎస్లకు సరి సమానంగా 15 సీట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే రోహిత్రావు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ సంఖ్య 16కు చేరుకోగా మరో సీటు అవసరం ఉంది. అలాగే బీఆర్ఎస్కు అధికారం దక్కాలంటే 2 సీట్లు కావాల్సి ఉంది. దీంతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్ మెదక్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ వారి ఓట్లు ఈ మున్సిపల్ పరిధిలో లేవు. దీంతో వారి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్కు సైతం బీజేపీ మద్దతు తప్పనిసరి.
నర్సాపూర్లో బుజ్జగింపుల పర్వం..
నర్సాపూర్లో 15 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు రాగా బీఆర్ఎస్కు 5 సీట్లు వచ్చాయి. బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ చైర్మన్ పీఠానికి మ్యాజిక్ ఫిగర్ 9 సీట్లు అవసరం. కాగా స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎక్స్ అఫీషియో మెంబర్గా నమోదు చేసుకోవటంతో బీఆర్ఎస్ బలం సైతం 6కు పెరిగింది. దీంతో పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే ఆ రెండు పార్టీలకూ ఇంకా 3 సీట్లు కావాలి. బీజేపీ మద్దతు తప్పనిసరి కావటంతో మద్దతుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కమలం పార్టీ నేతలను బుజ్జగిస్తున్నారని తెలిసింది.
మెదక్ కలెక్టరేట్: మెదక్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఆదివారం భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సమస్యాత్మక పరిస్థితులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ టౌన్ సీఐ మహేష్, జిల్లా సైన్స్అధికారి రాజిరెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
కాంగ్రెస్ + కమలం దోస్తీ!
మెదక్, నర్సాపూర్ పుర పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, కమలం నేతలతో దోస్తీ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నందుకు గాను, మెదక్లో వైస్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపిపట్లు తెలిసింది. అలాగే నర్సాపూర్లోనూ కాంగ్రెస్కు బీజేపీ మద్దతు ఇవ్వాలంటే చైర్మన్ పీఠం ఇవ్వాలని కమలం నేతలు పట్టుపడుతున్నారు. దీనిపై ఇంకా చర్యలు జరుగుతున్నట్లు సమాచారం.
నేడు ‘పుర’చైర్మన్ల ఎన్నిక
మెదక్, నర్సాపూర్లో హంగ్
బీజేపీ మద్దతుపై ఉత్కంఠ
కట్టుదిట్టంగా భద్రత
అదనపు ఎస్పీ మహేందర్
హంగ్లో కింగ్ ఎవరు?


