అక్రమాలను సహించేది లేదు
అల్లాదుర్గం(మెదక్): ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అక్రమాలు జరిగితే సహించేది లేదని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం హెచ్చరించారు. మండలంలోని ముస్లాపూర్లో బుధవారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఇంటి నిర్మాణాలను త్వరగా చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. జిల్లాలో 9,208 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 1,457 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. 4,642 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటివరకు రూ.100 కోట్ల పైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. బిల్లుల మంజూరు, ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడితే 19005395091, 8712082717 నంబర్లకు పిర్యాదు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఈ ప్రసన్న, ఏఈ ఆక్రమ్, మాజీ ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.
జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం


