ఎత్తుకు.. పై ఎత్తు
మెదక్జోన్: మున్నిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రచారానికి నేటితో తెరపడనుండటంతో నేతలు అభ్యర్థుల గెలుపు కో సం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ పీఠం ఆశించి బరిలో నిలిచిన ముఖ్య నేతలను ఓడించటమే లక్ష్యంగా ప్రత్యర్థి అభ్యర్థులు వ్యూహా, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో పుర ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
ముఖ్య నేతల ఓటమే లక్ష్యంగా..
జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ నాలుగు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ప్రచారానికి నేటితో తెర పడనుండటంతో హామీలు గుప్పిస్తున్నారు. ఓటర్లు అడిగిన పనులను కాదనకుండా చేస్తామంటున్నారు. దేవుళ్లపై ఒట్లు వేస్తూ ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక అభ్యర్థిపై, మరో అభ్యర్థి కుట్రలు పన్నుతున్నారు. మెదక్ పట్టణంలోని ఓ వార్డులో అభ్యర్థి గతంలో కౌన్సిలర్గా పనిచేసిన సమయంలో మీరు ఓట్లు వేయ లేదని చెప్పాడంటూ, ఓ వర్గాన్ని సదరు అభ్యర్థికి దూరం చేసేందుకు ప్రత్యర్థి అభ్యర్థి పాచికలు వేసి నట్లు తెలిసింది. ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మరో వార్డులోనూ గతంలో కౌన్సిలర్గా పనిచేసిన వ్యక్తికి మళ్లీ అదేవార్డులో రిజర్వేషన్ కలిసిరావటంతో బరిలో నిలిచాడు. దీంతో ఆ వార్డులో వేరే వార్డుకు చెందిన ఓ వ్యక్తి పోటీ చేశాడు. గతంలో కౌన్సిలర్గా పనిచేసిన ఆయన, అప్పట్లో ఒక వర్గానికి చెందిన వారు డబ్బులు తీసుకొని ఓట్లు వేశారంటూ ప్రచారం చేశాడని, ప్రస్తు తం అతనికి కాకుండా తనకు మద్దతు ఇవ్వాలని ప్రచారం చేస్తున్నాడు.
హాట్ హాట్గా విమర్శలు
పార్టీ గుర్తులతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ అభ్యర్థులను గెలిపించుకొని బల్దియాలను సొంతం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు జోరుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇందులో ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవటంతో ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఫలానా అభివృద్ధి పనిచేస్తామని హామీలు ఇస్తూ ఓటర్లను మచ్చిక చేసుకోవటం సాధారణమే కానీ, ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని పట్టణ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
పావులు కదుపుతున్న పార్టీలు
గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
నేటితో ముగియనున్న ‘పుర’ ప్రచారం
ఎత్తుకు.. పై ఎత్తు


