ప్రతి ఇంచూ సర్వే చేస్తాం
మనోహరాబాద్(తూప్రాన్): భూ భారతి పథకంలో భాగంగా రీ సర్వే చేపడుతున్నామని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని కోనాయపల్లి(పీటీ)లో నిర్వహించిన రెవెన్యూ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాన్ని జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంచూ రీ సర్వే చేస్తామని, గ్రామస్తులు సహకరించాలన్నారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన భూ సమస్యలు సైతం పరిష్కారం అవుతాయన్నారు. సమావేశంలో సర్వేయర్ ఏడీ కిషన్, తహసీల్దార్ ఆంజనేయులు, సర్పంచ్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
సమయపాలన తప్పనిసరి
చిన్నశంకరంపేట(మెదక్): గ్రామీణ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల్లో అలసత్వం వహించొద్దని డీఎంహెచ్ఓ శ్రీరామ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం నార్సింగి మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుతో పాటు ల్యాబ్, మందుల నిల్వ రూం, వార్డులను పరిశీలించారు. జాతీయ ఆరోగ్య సేవలను మహిళలకు, చిన్నారులకు అవసరమైన సమయంలో అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా మెడికల్ ఆఫీసర్ రేఖకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట వైద్యులు రవికుమార్, రేణుక, పీహెచ్ఓ శ్రీనివాస్ ఉన్నారు.
జిల్లాస్థాయి
ఖోఖో జట్టుకు ఎంపిక
నర్సాపూర్ రూరల్: జిల్లాస్థాయి సీఎం కప్ ఖోఖో జట్టుకు నర్సాపూర్ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ కిషోర్, వైస్ ప్రిన్సిపాల్ బసవరాజు, పీఈటీ లింగం శనివారం తెలిపారు. మండలస్థాయి పోటీల్లో బాలికలు మొదటి స్థానంలో నిలవగా, బాలురు రెండో స్థానంలో నిలిచారు. బాలికల జట్టు నుంచి ఆరుగురు, బాలుర జట్టు నుంచి నలుగురు ఎంపికై నట్లు చెప్పారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించండి: డీపీఓ
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వం పంచాయతీలకు మంజూరు చేసిన పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని డీపీఓ యాదయ్య కార్యదర్శులకు సూచించారు. శనివారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో వారితో సమావేశం నిర్వహించారు. మండలానికి రూ. 50 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. సర్పంచ్ల బ్యాంక్ అకౌంట్ త్వరగా ఓపెన్ చేసి మంజూరైన పెండిండ్ బిల్లులు చెల్లించాన్నారు. దీంతో పాటు యాక్షన్ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, నీటి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రామారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్, ఏపీఓ పుణ్యదాస్ పాల్గొన్నారు.
ప్రతి ఇంచూ సర్వే చేస్తాం
ప్రతి ఇంచూ సర్వే చేస్తాం


