బుజ్జగింపుల పర్వం
● ప్రధాన పార్టీలకు తలనొప్పిగా రెబల్స్ ● ఒకే పార్టీ నుంచి పోటీలోనలుగురు, ఐదుగురు
తూప్రాన్: నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీల్లో బుజ్జగింపుల పర్వం మొదలైంది. టికెట్ దక్కని వారితో పాటు, రెబల్స్ బెడద ఇప్పుడు సవాల్గా మారింది. వార్డుల్లో పార్టీలు ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు రంగంలోకి దిగడంతో సమీకరణాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్కు రెబల్స్ నామినేషన్లు దాఖలు చేయడం, పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మా రింది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కోచోట పార్టీ అభ్యర్థితో పాటు రెబెల్ అభ్యర్థి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఓట్ల విభజన తప్పదన్న ఆందోళన పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. దీంతో బుజ్జగింపులకు తెర లేపారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం వరకు గడువు ఉండడంతో తూప్రాన్ మున్సిపాలిటీలో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులను బుజ్జగించేందుకు వారి సన్నిహితులతో పావులు కదుపుతున్నారు. 16 వార్డులకు 141 మంది నామినేషన్లు దాఖలు చేయగా, నామినేషన్లు వేసిన రెబల్స్ బరిలో నుంచి తప్పుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా కొన్ని వార్డుల్లో నామినేషన్ వేసిన వారికి రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు ఇస్తూ పోటీ నుంచి తప్పుకునేలా సీనియర్ నాయకులు చర్యలు ముమ్మరం చేశారు. కాగా కొందరు ఎన్నికల ఖర్చు భరించడం ఇబ్బంది అవుతుందని, బరిలో ఉండాలా.. వద్దా..? అనే ఆలోచనలో పడ్డారు. ఎదుటివారు ఇచ్చే ఆఫర్లు తీసుకొని పక్కకు తప్పుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.


