
ఎందరో త్యాగఫలితమే..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్
మెదక్జోన్: నిరంకుశ, రాచరిక నిజాంపాలన విముక్తికోసం ఎంతోమంది మహానుభావుల త్యాగఫలితమే సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, సుభాష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అల్లాదుర్గం(మెదక్): ప్రభుత్వం ప్రజా పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ప్రభుత్వ కార్యాలయాలపై బుధవారం జాతీయ జెండాలను సూచించింది. అయితే జాతీయ జెండాను ఎగురవేయాల్సి ఉండగా ఇరిగేషన్ అధికారులు దూరంగా ఉన్నారు. ఈ సంఘటన అల్లాదుర్గంలో చోటుచేసుకుంది. కాగా, ఇరిగేషన్ కార్యాలయం పట్టణానికి దూరంగా ఉండటంతో విధుల నిర్వహణపై తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయకుండా అధికారులు దూరంగా ఉండటం గమనార్హం. ఈ కార్యాలయంలో ఇరిగేషన్ డీఈ, ఏఈ, జూనియర్ అసిస్టెంట్, మరో ముగ్గురు లష్కరులు విధులు నిర్వహిస్తున్నారు. ఇంతమంది ఉన్న కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీఈఓ రాధా కిషన్
మెదక్ కలెక్టరేట్: ఇన్స్పైర్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ ప్రొఫెసర్ రాధాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ పాఠశాలల నుంచి 695 నామినేషన్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు తెలిపారు. నేటికీ నమోదు చేయని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గైడ్ టీచర్లు ప్రత్యేక చొరవ చూపి త్వరగా నామినేషన్లను ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు ఇతర వివరాలకు జిల్లా సైన్న్స్ అధికారి రాజిరెడ్డి నంబర్. 8328 599157ను సంప్రదించాలని సూచించారు.
తూప్రాన్:ఎంపీడీఓ కార్యాలయంలో త్వరలోనే కోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆర్డీఓ జయచంద్రారెడ్డి బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మండలానికి నూతనంగా మంజూరైన కోర్టుకు సరైన భవన సముదాయం లేకపోవడంతో కొంతకాలం జాప్యం నెలకొందన్నారు. ఇందులో భాగంగానే నూతనంగా నిర్మాణంలో ఉన్న సమీకృత సముదాయ భవనంలో ఎంపీడీఓ కార్యాలయం కొనసాగుతుందన్నారు. ఇందుకోసం ఈ నెల 25న కోర్టు కొనసాగేందుకు ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచన మేరకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. అలాగే నూతన సమీకృత భవనంలో త్వరలో తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయం సైతం అందుబాటులోకి రానుందని తెలిపారు.
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యులతో కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 18 నుంచి అక్టోబర్ 2 వరకు స్వస్థనారీ స్వశక్తి అభియన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపటి నుంచి కంటి వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కావున మండలంలోని ప్రజలు కంటి పరీక్షల కోసం నార్సింగి ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.