
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
కార్యకర్తలకు జగ్గారెడ్డి పిలుపు
కొండాపూర్(సంగారెడ్డి): స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధి మల్కాపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఎంపీపీలతో పాటు మున్సిపల్లో కూడా కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలన్నారు. మరో 8 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, పేదల సంక్షేమం కోసం సీఎం రేవంత్రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. 10 ఏళ్ల లో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, ఎంపీటీసీ నరసింహారెడ్డి, నాయకులు వెంకటేశంగౌడ్, శ్రీకాంత్రెడ్డి, నరసింహులు, ప్రభుదాస్, మల్లారెడ్డి, సునీల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల అమలుకు ఉద్యమం
నర్సాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం టీపీసీసీ ఉద్యమం చేపట్టిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. ఢిల్లీలో చేపట్టిన మూడు రోజుల ఉద్యమంలో పాల్గొనేందుకు సోమవారం జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. కాగా బీసీలకు కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరుగుతుందని, 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.
డిప్లొమాలో అవకాశం
మెదక్జోన్: పదో తరగతి పాసైన విద్యార్థినులు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో చేరాలనుకుంటే ఎలాంటి ఎంట్రెన్స్ రాయకున్నా నేరుగా డిప్లొమాలో చేరవచ్చని మెదక్ ప్రభు త్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ భవాని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, సివిల్ ఇంజనీర్ మూడు కోర్సులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు కళాశాలలో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
హవేళిఘణాపూర్(మెదక్): పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని జక్కన్నపేట, రాజ్పేట, సర్ధన, కూచన్పల్లిలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ, రెండేళ్లు గడిచినా నివేదికలు వెలువరించకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో నరేందర్రెడ్డి, రఘుబాబు, సంతోశ్, లక్ష్మీకాంతం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిగాచీ బాధితులను ఆదుకోండి: సీఐటీయూ
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో బాధిత కార్మిక కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి నెలరోజులు దాటినా బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పూర్తి నష్టపరిహారం చెల్లించడంతో పాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పోరాడుతామని హెచ్చరించారు. దీక్షలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జిల్లా కార్యదర్శులు జయరాజ్, సాయిలు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య, నాయకులు మాణిక్యం, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి