
నేటి నుంచి ఊరూరా ‘భూ భారతి’
● 392 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు ● కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్ కలెక్టరేట్/కొల్చారం: పటిష్ట ప్రణాళికతో మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టర్లో మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలోని చిలప్చెడ్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసుకొని మండలంలోని 16 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొత్తం 1,045 దరఖాస్తులు వచ్చాయని, వాటిని కేటగిరిల వారీగా విభజించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇందులో 250 దరఖాస్తులు డిస్పోజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 392 రెవెన్యూ గ్రామాలు ఉన్నా యని, వాటిలో దశలవారీగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తులను ఎటువంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు. సమస్యల పరిష్కార నిమిత్తం హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ఆరుగురు అధికారుల బృందం పాల్గొంటుందని వెల్లడించారు. అనంతరం హౌసింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, డీఎంహెచ్ఓ శ్రీరామ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే కొల్చారం మండలంలోని కోనాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. వాతావరణంలో నెలకొన్న మార్పుల దృష్ట్యా కొనుగోళ్లు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి, రైతులకు సూచించారు.