
మావన అక్రమ రవాణాను అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: మనుషుల అక్రమ రవాణాను నిరోధించడం ప్రతీ ఒక్కరి బాధ్యతని విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వచ్ఛంద సంస్థ ప్రజ్జ్వల, విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మనుషుల అక్రమ రవాణాను అరికట్టే అంశంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ అక్రమ రవాణా ప్రపంచంలోనే అతి పెద్ద నేరంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు అక్రమరవాణాకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగం, సినిమా అవకాశాల ద్వారా మోసం చేసి విదేశాలకు అమ్ముతున్నట్లు తెలిపారు. ప్రతీ మహిళ తమ పరిధిలో ఉన్న వారికి అవగాహన కల్పించి రక్షించాలని చెప్పారు. ప్రజ్వల ఎన్జీఓ సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రయ్య మాట్లాడుతూ.. సీ్త్ర శిశు సంక్షేమ, పోలీస్, విద్యా, న్యాయ శాఖల సమన్వయంతో ఇప్పటివరకు 29,200 మంది మహిళలను కాపాడి పునరావాసం కల్పించినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1930ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ప్రజ్జ్వల సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అత్యధికంగా మహిళలే బాధితులు
విద్యాశాఖ ఏఎంఓ సుదర్శనమూర్తి