
గిరిజనులకు వాహనాలు
● మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ ●
● జిల్లాలో 15 తండాల ఎంపిక
● 90 శాతం సబ్సిడీపైఅందించేందుకు చర్యలు
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ధికి ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మారుమూల తండాలలో నివసిస్తున్న నిరుపేద గిరిజనులను గుర్తించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. గిరిజనులు మత్స్యకారుల మాదిరిగా తండాల్లో చేపలు పెంపకానికి ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేస్తుంది. అలాగే వాటిని విక్రయించుకునేందుకు విక్రయ కేంద్రాలు, ఇతర ప్రాంతాలకు చేపలను తరలించేందుకు ద్విచక్ర వాహనాలు, ఆటో లను 90 శాతం సబ్సిడీపై అందిస్తుంది. ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా 9 మండలాల నుంచి 15 గిరిజన తండాలను ఎంపిక చేశారు. ఈ తండాలకు చెందిన గిరిజన ప్రజలు వారి ఆసక్తికనుగుణంగా దర ఖాస్తు చేసుకుంటే అవసరమైన వాహనాలు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
వసతులు కరువు
జిల్లాలోని ఎంపిక తండాల్లో ఎక్కడా చేపల చెరువుల ఏర్పాటుకు అవకాశం లేదు. చేపల చెరువులు ఉండాలంటే వర్షాధారంగా నదులు, వాగులు, కాల్వల ద్వారా నీటి సరఫరా జరగాలి. అలాంటి అవకాశం లేకపోవడంతో తండాల్లో చెరువుల ఏర్పాటును ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. గిరిజనులు స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మత్స్యశాఖకు చెందిన వాహనాలు మాత్రమే అందిస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు.
ఈ తండాల్లోని గిరిజనులు దరఖాస్తులు చేసుకునేలా చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సంబంధిత గ్రామాల కార్యదర్శులకు బాధ్యతలను అప్పగించారు.
వాహనాలు
చేపలను శీతలీకరించిన వాహనాలు, ఇన్సులేటెడ్ వాహనాలు, ఐస్బాక్స్తో కూడిన మోటార్ సైకిల్, ఐస్ బాక్స్లతో కూడిన సైకిల్, చేపల అమ్మకం కోసం ఈ– రిక్షాలు, సహా ఐస్బాక్స్తో కూడిన త్రిచక్ర వాహనాలు, ప్రత్యక్ష చేపల విక్రయ కేంద్రాలు, రోజుకు 2 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల చేపల మిల్లులు, అక్వేరియం, అలంకార చేపల కియోస్క్లతో సహా చేపల కియోస్క్ల నిర్మాణం, సాంప్రదాయ మత్స్యకారులకు పడవలు, వలలు అందించడం, ఫిష్ వాల్యూయాడ్ ఎంటర్ప్రైజెస్ యూనిట్లు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది.