
మల్లన్నా.. కోడెలకు దిక్కెవరూ?
తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. స్వామివారికి ఎక్కువగా పట్నాలు, బోనాలు, అభిషేకాలు, కల్యాణోత్సవంతో మొక్కులు తీర్చుకుంటారు. అలాగే పలువురు భక్తులు కోడెలను దేవాలయానికి సమర్పిస్తుంటారు. అయితే వీటి సంరక్షణ ఆలయ నిర్వాహకులకు కష్టంగా మారుతోంది. ఇందుకు కారణం ప్రత్యేక గోశాల లేకపోవడమే. – సాక్షి, సిద్దిపేట
తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కొమురవెల్లికి భక్తులు భారీగా తరలివస్తారు. దేవుడి మొక్కుల కింద కోడెలను ఆలయానికి సమర్పించడం ఏళ్లుగా కొనసాగుతోంది. అలాగే కొందరు కోడెలు కడతామని మొక్కుతారు. దేవాలయానికి రూ.200 చెల్లించి టోకెన్ తీసుకుని అక్కడే ఉన్న కోడెను గుడికి సమీపంలో కట్టేస్తారు.
ట్రస్ట్కు కోడెలు
దేవాలయాలనికి కోడెల నిర్వహణ భారంగా ఉండటంతో ఓ ప్రైవేట్ ట్రస్ట్కు అప్పగిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. కోడెలను ఓ ప్రైవేట్ గోశాలకు ఇస్తుండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఇచ్చిన కోడెలను నిర్వహణ చేయకపోతే ఎలా అని అంటున్నారు. దేవాలయానికి గత మూడేళ్లలో 100 కోడెలు భక్తులు సమర్పిస్తే వాటిలో 81 కోడెలు ఓ ప్రైవేట్ ట్రస్ట్కు అప్పగించడం గమనార్హం. మూడేళ్లలో నాలుగు కోడెలు మృతిచెందాయి. దేవాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లో 15 కోడెలను సంరక్షిస్తున్నారు. వేములవాడలో కోడెలు మృతిచెందుతుండటంతో కొమురవెల్లిలో అందజేసిన కోడెలు ఎలా ఉన్నాయో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
షెడ్లో నిర్వహణ
దేవాలయం సమీపంలోని ఒక షెడ్లో కోడెలను సంరక్షిస్తున్నారు. తక్కువ స్థలంలో షెడ్ ఉండటంతో కొన్నింటినే ఉంచుతున్నారు. దేవాలయానికి ఏటా రూ. కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే దాదాపు 150 ఎకరాలకు పైగా స్థలం ఉంది. ఆ స్థలాల్లో కొంత భాగం గోశాల నిర్మాణం చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే ఆలయ సమీపంలో గోపూజ చేసుకునేందుకు మండపం ఏర్పాటు చేయాలన్న విన్నపాలు వస్తున్నాయి. ఇప్పటకై నా దేవాదాయ శాఖ, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక గోశాలను నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
కొమురవెల్లి ఆలయంలో ‘గోశాల’ లేక అవస్థలు
మూడేళ్లలో 100 కోడెలనుఅందజేసిన భక్తులు
చేసేదిలేక ప్రైవేట్కు 81 కోడెలు
తాత్కాలిక షెడ్లో 15 పశువుల సంరక్షణ
ప్రత్యేక గోశాల ఏర్పాటు చేయాలంటున్న భక్తులు