
రేపటి నుంచి డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన
మెదక్ కలెక్టరేట్: ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు మెదక్ డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాధాకిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీసెట్ – 2025లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెదక్ డైట్ కళాశాలలో జరిగే పరిశీలనకు సకాలంలో హాజరుకావాలని సూచించారు. ర్యాంక్ కార్డు, హాల్టికెట్, పదో తరగతి, ఇంటర్ మెమోలు, 1 నుంచి ఇంటర్ వరకు బోనాఫైడ్, కులం, ఆదాయం వంటి పూర్తి ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు. 9న 1 నుంచి 500 ర్యాంకు వరకు, 10న 501 నుంచి 1,000, 11న 1,001 నుంచి 1,500, 12న 1,501 నుంచి 2,000, 13న 2,001 నుంచి 2,198 వరకు రావాలని వివరించారు. సందేహాలకు 9949993717, 939 7682345, 9701767857 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
వైద్య సేవలపై
కాయకల్ప బృందం ఆరా
రామాయంపేట(మెదక్): రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం కాయకల్ప రాష్ట్ర ప్రతినిధుల బృందం సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. టీం హెడ్ డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో సభ్యులు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. రోగుల వెంట వచ్చే వారికి ఇస్తున్న భోజనం, బయో మెడికల్ వినియోగం తీరును పరిశీలించారు. ఆస్పత్రిలో డెలివరీలు ఎందుకు కావడం లేదని సూపరింటెండెంట్ లింబాద్రిని ప్రశ్నించారు. మార్చురీలో ఫ్రీజర్ల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో ఇన్, అవుట్ పేషెంట్ల వివరాలతో పాటు ఆస్పత్రికి సంబంధించి పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు. డాక్టర్లతో పాటు సిబ్బంది విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఒకే దేశం,
ఒకే ఎన్నికపై అవగాహన
నర్సాపూర్: ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంశంపై పార్టీలకతీతంగా కుల, యువజన సంఘాలకు అవగాహన కల్పిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్ చెప్పారు. శనివారం పట్టణంలోని వీరభద్రీయ కులసంఘ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధిష్టానం మేరకు ఆయా సంఘాలకు ఒకే దేశం, ఒకే ఎన్నికపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ సాగుతో
రైతులకు మేలు
శివ్వంపేట(నర్సాపూర్): రైతులు సేంద్రియ సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు శరవణన్, పాపారావు, శ్రీనివాస్ అన్నారు. వికసిత కృషి సంకల్ప అభియాన్లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో మండల పరిధి గోమారంలో శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ప్రతి రైతు భూసార పరీక్షలు నిర్వహించి అందుకనుగుణంగా అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల ఎంపిక చేసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వాడకం పూర్తిస్థాయిలో తగ్గించాలన్నారు. ప్రతి రైతు తన ఇంటికి సరిపడా అన్ని రకాల కూరగాయలు, ధాన్యం, ఇతర పంటలు సేంద్రియ పద్ధతిలో పండించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ వ్యవసాయ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఓ లావణ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన

రేపటి నుంచి డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన