
విద్యలో సమూల మార్పులు రావాలి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ బడులు నిలబడాలి– చదువులో అంతరాలు పోవాలి అని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రచార జాతా కార్యక్రమంలో మాట్లాడారు. పేద, ధనిక బేధం లేకుండా అందరి పిల్లలు ఒకే చోట చదువుకోవాలనే లక్ష్యంతో పౌర స్పందన వేదిక పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో పాఠశాలలు, కళాశాలు ఎంత డబ్బు పెడితే అంతా చదువు అన్నచందంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలకు నాణ్యమైన విద్యనందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీఎస్వీ ఉపాధ్యక్షుడు మంగ దక్షణమూర్తి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పద్మారావు తదితరులు పాల్గొన్నారు.