
భూ భారతితో శాశ్వత పరిష్కారం..
టేక్మాల్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: భూ భారతితోనే భూ సమస్యల పరిష్కారమవుతాయని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. మంగళవారం టేక్మాల్ మండలం షాబాద్ తాండలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర, అదనపు కలెక్టర్ నగేశ్లతో కలిసి కలెక్టర్ రాహుల్రాజ్ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి అమలుకు చిలప్చేడ్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకుమన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటిరోజు జిల్లావ్యాప్తంగా 31 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 929 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీటిని క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి తదుపరి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
శాంతియుతంగా బక్రీద్...
ప్రజలు మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో బక్రీద్ను జరుపుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఏ వర్గానికి చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, రవాణాశాఖ అధికారులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్రాజ్
ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు
షాబాద్ తాండ రెవెన్యూ సదస్సును పరిశీలించిన కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా 929 దరఖాస్తులు