
ల్యాబ్ల.. చీటింగ్!
నిర్ధారణకు వెళితే నిలువు దోపిడీ!
● జిల్లావ్యాప్తంగా 52 ల్యాబ్లు
● అనుమతిలేనివి డబుల్
● నిబంధనలకు పాతర
● పట్టించుకోని వైద్యాధికారులు
ప్రజారోగ్యంతో పరీక్ష కేంద్రాల (ల్యాబ్) నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు. వ్యాధి నిర్ధారణకు వెళితే నిలువు దోపిడీ చేస్తున్నారు. నిబంధనలు విస్మరించి అనుమతి లేకుండానే యథేచ్ఛగా నడుపుతున్నారు. అర్హత లేకున్నా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ల్యాబ్లో ఒక్కో రకం ఫలితాలు వస్తుండడంతో రోగులు ఏది నమ్మాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. – మెదక్ మున్సిపాలిటీ
వాస్తవానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే వైద్యశాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అన్నిరకాల చికిత్సలకు సంబంధించిన పరికరాలు ఉండాలి. ఎంబీబీఎస్ డాక్టర్తో పాటు పాథలాజిస్ట్, టెక్నీషియన్, మైక్రో బయాలజిస్ట్ ఉండాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఇవేమీ లేకుండానే యథేచ్ఛగా ల్యాబ్లు నిర్వహిస్తున్నారు. రోగుల అవసరాలను ఆసరాగా చేసుకొని ల్యాబ్ నిర్వాహకులు వివిధ రకాల పరీక్షల పేరుతో ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో అనుమతి పొందిన 52 (ల్యాబ్) డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాని అంతకు రెట్టింపు స్థాయిలో అనుమతిలేనివి కొనసాగుతున్నట్లు సమాచారం.
సీజన్లో జోరుగా దందా!
వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఆస్పత్రుల్లో ఎక్కువగా రోగులు చేరుతుంటారు. ఇదే సమయంలో కొన్ని అస్పత్రులకు అనుసంధానంగా ల్యాబ్లు లేకపోవడంతో వైద్యులు సూచించిన ల్యాబ్లకు పరీక్షలకు వెళ్తుంటారు. ఇదే అదనుగా కొందరు ఎక్కువ వసూలు చేస్తున్నారు. రూ. 100కు నిర్వహించే పరీక్షకు రూ. 500 వరకు బిల్లులు వేస్తున్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్న ల్యాబ్లో పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. కాని కొందరు వైద్యులు తమకు కమీషన్లు ఇచ్చే ల్యాబ్లకు వైద్య పరీక్షల కోసం రోగులను పంపుతున్నారు.
కానరాని ఫీజు బోర్డులు
మెడికల్ ల్యాబ్లలో ఆయా వైద్య పరీక్షలకు సంబంధించి ధరల పట్టికలు ఏర్పాటు చేయాలి. జిల్లాలో కొనసాగుతున్న ల్యాబ్లలో అధికశాతం వాటిల్లో ధరల పట్టికలు కనిపించడం లేదు. ఒకవేళ ధరల పట్టికలు పెడుతున్నా.. వాటిని రోగులకు కానరాకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఒకే రకమైన టెస్ట్లకు ఒక ల్యాబ్కు మరో ల్యాబ్కు ధరల విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. పెద్ద ల్యాబ్ల నిర్వాహకులు రాయితీలను ప్రకటిస్తున్నారంటే.. ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
నియంత్రణ కరువు
సాధారణంగా ల్యాబ్లు ఐదేళ్ల కోసారి లైసెన్స్లు రెన్యూవల్ చేసుకోవాలి. లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు ల్యాబ్ దరిదాపుల్లోకి అధికారులు వెళ్లడం లేదు. దీంతో సదుపాయలు, అవసరమైన యంత్ర పరికరాలు లేకపోయినా నిర్వాహకులు అలాగే నడిపించేస్తున్నారు. అయితే తనిఖీలు చేయకుండా ఉండేందుకు నిర్వాహకులు అధికారులను మచ్చిక చేసుకుంటున్నట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి.
తనిఖీలు నిర్వహిస్తున్నాం
జిల్లాలో ప్రైవేట్గా 52 ల్యాబ్లు ఉన్నాయి. వీటిలో ఎప్పటికప్పుడు తని ఖీలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఆస్పత్రిని బట్టి ధరలు ఉంటాయి. అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదు. వచ్చే నెలలో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానుల తో సమావేశం నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేస్తాం.
– శ్రీరాం, డీఎంహెచ్ఓ

ల్యాబ్ల.. చీటింగ్!