
బాసర ట్రిపుల్ఐటీ పిలుస్తోంది
పాపన్నపేట(మెదక్): సర్కార్ బడిలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ ప్రకటించింది. ఈ ఏడాది పదో తరగతిలో జీపీఏ విధానాన్ని తొలగించి, మార్కుల విధానం ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అడ్మిషన్లలో మార్పులు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా 24 మార్కులు కలపనుంది. ఈ మేరకు 2025– 26కు సంబంధించి ట్రిపుల్ఐటీ దరఖాస్తులు ఈనెల 31 నుంచి జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనుంది. ఈసారి జిల్లాలో 10,370 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయగా, 10,045 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
అందుబాటులో 1,500 సీట్లు
నిరుపేద గ్రామీణ విద్యార్థులకు పదో తరగతి అనంతరం ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008లో ఆరేళ్ల ఇంటిగ్రేటేడ్ ట్రిపుల్ఐటీలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో ట్రిపుల్ఐటీ కాలేజీని నిర్మించారు. ఇందులో 1,500 సీట్లు ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఉద్యోగాలు వస్తున్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు లభిస్తాయి.
ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహం
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం డిప్రివేషన్ స్కోర్ విధానం అమల్లోకి తెచ్చింది. గతేడాది వరకు పదో తరగతిలో గ్రేడింగ్ విధానం అమల్లో ఉన్నందున ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 0.4 గ్రేడింగ్ పాయింట్లు కలిపేవారు. ఈ విద్యా సంవత్సరం మళ్లీ మార్కుల విధానం ప్రవేశపెట్టడంతో ఆరు సబ్జెక్టులలో ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 24 మార్కులు కలుపనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఆదర్శ (నాన్ రెసిడెన్షియల్ ) విద్యార్థులకు ఇవి వర్తిస్తాయి.
రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
సర్కార్ బడిలో చదివితే24 మార్కులు అదనం
జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణులు 10,045 మంది
పది విద్యార్థులకు గుడ్ న్యూస్
ప్రభుత్వ పాఠశాలల్లో పది పాసైన విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్. సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులు మాత్రమే చదువుతారు. ఈ క్రమంలో కార్పోరేట్ పాఠశాలల విద్యార్థుల నుంచి పోటీ తట్టుకోవడం ఇబ్బందికరమే. అయినా నేను 542 మార్కులు తెచ్చుకున్నా. ఇప్పుడు 24 మార్కులు కలిపితే 566 అవుతాయి. ట్రిపుల్ఐటీలో సీటు వచ్చే అవకాశం మెరుగవుతుంది.
– దీక్షిత, విద్యార్థిని, కుర్తివాడ

బాసర ట్రిపుల్ఐటీ పిలుస్తోంది