
ఐటీఐకి అడుగులు పడేనా?
మనోహరాబాద్(తూప్రాన్): మండలంలోని కాళ్లకల్, కూచారం, జీడిపల్లి, ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ గ్రామాల్లో పరిశ్రమల వాడలు ఏర్పాటయ్యాయి. కాగా ఇక్కడి యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించడం లేదు. ఉన్నత విద్యే కాకుండా సాంకేతిక విద్య కలిగిన వారికి పరిశ్రమల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అయితే అందుబాటులో ఐటీఐ కళాశాల లేకపోవడంతో స్థానిక విద్యార్థులు సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఐటీఐ ఏర్పాటుకు బాటలు వేయాలని పలువురు కోరుతున్నారు. కాగా పరిశ్రమల వాడ ఏర్పాటుకు రైతుల నుంచి భూములు సేకరించే సమయం (2007)లో అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి ఇంటికి ఒకరి చొప్పున ఉపాధి కల్పిస్తామని, ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయించి స్థానికులకు సాంకేతిక విద్యనందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పరిశ్రమల ఏర్పాటుపై పెట్టిన దృష్టి యువత ఉపాధిపై పెట్టలేదని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనోహరాబాద్ మండల నేత ర్యాకల హేమలత జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె సైతం ఐటీఐ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి ఏర్పాటు చేయలేకపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచించి అందుబాటులో ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
పారిశ్రామికవాడలో
ఏర్పాటుకు గతంలోనే హామీ
స్థల సేకరణకు కృషి చేశాం
ముప్పిరెడ్డిపల్లి శివారులో గల పరిశ్రమల వాడలో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఫైల్ పైస్థాయిలో ఉండగా, ప్రభుత్వం మారింది. దీంతో ఐటీఐ ఏర్పాటుకు బ్రేక్ పడింది.
– హేమలత, మాజీ జెడ్పీ చైర్పర్సన్

ఐటీఐకి అడుగులు పడేనా?