
● పాతది నిరుపయోగం.. కొత్తది అసంపూర్ణం ● రోడ్డు పక్కనే
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో గతంలో రూ. 50 లక్షలతో నిర్మించిన రైతుబజార్ దుకాణ సముదాయం నిరుపయోగంగా మారింది. రూ. 2 కోట్లతో నూతనంగా చేపట్టిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ సముదాయం పిల్లర్లస్థాయిలోనే నిలిచిపోయింది. దీంతో తాత్కాలికంగా మెదక్ రోడ్డు పోలీస్స్టేషన్ పక్కన మార్కెట్ కొనసాగుతోంది. ఆరేళ్ల క్రితం నిర్మించిన రైతుబజార్ దుకాణాల సముదాయం మార్కెట్ కొనసాగే ప్రదేశంలో కాకుండా అనువుగా లేని చోట నిర్మించారు. మార్కెట్కు వెళ్లడానికి కనీసం రోడ్డు సదుపాయం సరిగా లేకపోవడంతో పాటు పార్కింగ్ సైతం లేదు. దీంతో అక్కడికి వెళ్లడానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. దీంతో మార్కెట్ను ఎత్తివేసి కొద్ది రోజుల పాటు జూనియర్ కళాశాల ఎదురుగా సీఎస్ఐ ఆధీనంలో ఉన్న స్థలంలో ఏర్పాటు చేశారు. చర్చి నిర్వాహకుల అభ్యంతరం మేరకు అక్కడి నుంచి తొలగించి మెదక్ రోడ్డు మార్గంలో ఏర్పాటు చేశారు.
ఆసక్తిచూపని వ్యాపారులు
గతంలో కూరగాయల వ్యాపారం పట్టణంలోకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా కొనసాగేది. సరైన స్థలం లేకపోవడంతో వ్యాపారులతో పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో అధికారులు ప్రత్యేకంగా రైతుబజార్ నిర్మించి వ్యాపారులకు దుకాణాలను అలాట్ చేశారు. అయితే ఇందులో వ్యాపారం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. పట్టణ ప్రజలు అక్కడికి రాకపోడంతో రైతుబజార్లో కూరగాయల వ్యాపారం నిర్వహించడానికి వ్యాపారులు ఆసక్తి చూపలేదు. కేవలం మాంసం వ్యాపారులు కొందరు మాత్రమే అమ్మకాలు కొనసాగించారు. ఈ క్రమంలో అధునాతన రీతిలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ సముదాయం నిర్మాణానికి గతేడాది నిధులు మంజూరయ్యాయి. స్థలం అనువుగా లేకపోయినా ఎంపీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో నిర్మాణ పనులు చేపట్టారు. నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో పిల్లర్లస్థాయిలో పనులు నిలిచిపోయాయి.
నిరుపయోగంగా రైతుబజార్
రైతు బజార్.. బేజార్!
అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం
రామాయంపేటలో అసంపూర్తిగా నిలిచిపోయిన వెజ్, నాన్వెజ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. పాత రైతు బజార్ను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్

● పాతది నిరుపయోగం.. కొత్తది అసంపూర్ణం ● రోడ్డు పక్కనే

● పాతది నిరుపయోగం.. కొత్తది అసంపూర్ణం ● రోడ్డు పక్కనే