
ఇందిరమ్మ ఇళ్లు
నిమ్జ్ నిర్వాసితులకు
సభావేదికపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో కలెక్టర్ క్రాంతి, మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ,
ఎంపీ సురేశ్ షెట్కార్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మాణిక్రావు తదితరులు
మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం
మంత్రి కొండా సురేఖ
సంగారెడ్డి జోన్: ప్రతీ మహిళను కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రభుత్వం చేపట్టి ప్రతీ కార్యక్రమంలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించి, ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పెట్రోల్ బంక్ల నిర్వహణ కూడా వారే నిర్వహించబోతున్నారని వెల్లడించారు.
సమస్యల పరిష్కారానికే భూభారతి
మంత్రి దామోదర రాజనర్సింహ
గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారని, వాటిని పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చి పరిష్కారం దిశగా కృషి చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ చేపట్టి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అప్పటి కాంగ్రెస్ హయాంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి జరిగేది జహీరాబాద్ ప్రాంతమేనని వెల్లడించారు.
పారిశ్రామిక అభివృద్ధి దిశగా
ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్
జహీరాబాద్ నియోజకవర్గ పారిశ్రామిక అభివృద్ధి రంగంలో దూసుకుపోతోందని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జహీరాబాద్ ప్రాంతానికి నిమ్జ్ వచ్చిందని గుర్తు చేశారు. ప్రారంభంలో మూడు వేల ఎకరాలు సేకరిస్తే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భూ సేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని వి మ ర్శించారు. త్వరలోనే పూర్తిస్థాయిలో భూ సేకరణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రూ. 250 కోట్లతో 100 ఎకరాల విస్తీర్ణంలో చెరుకు రైతుల సమస్య పరిష్కారానికి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పట్టాలిచ్చే ప్రత్యేక బాధ్యతలు జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నిమ్జ్లో భూములు కోల్పోతున్న 5,612 నిర్వాసిత కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్రెడ్డి హామీనిచ్చారు. ఈ నిర్వాసితులకు పట్టాలు అందించే బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అప్పగిస్తున్నానన్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం రూ.494 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రేవంత్రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. 2014 తర్వాత మెదక్ జిల్లాతో పాటు, నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నిమ్జ్ నిర్వాసితుల సమస్యలను మంత్రి దామోదర రాజనర్సింహ తన దృష్టికి తెచ్చారని, వెంటనే అధికారులను పిలిచి నిర్వాసితులకు న్యాయం చేసేలా నష్టపరిహారం పెంచాలని ఆదేశించామన్నారు. జంట నగరాలకు తాగునీరు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందిస్తున్న సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను ప్రస్తావించిన రేవంత్రెడ్డి వీటికి నిధులు కేటాయిస్తామని చెప్పారు.
చెరుకు రైతుల సమస్య పరిష్కరిస్తాం
జహీరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. సహకార రంగంలో చక్కెర కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన పదెకరాల భూమిని నిమ్జ్లో కేటాయించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇక్కడ పది లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన చక్కెర కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హుందాయ్ ఇదే నిమ్జ్లో తన యూనిట్ స్థాపన పనులను త్వరలోనే ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కంపెనీకి 450 ఎకరాలు భూమిని కేటాయించామన్నారు. జిల్లాలోని రెండు జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అండర్ పాస్ల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకువస్తానని స్పష్టం చేశారు.
ఆదర్శనీయుడు బసవేశ్వరుడు
గౌతమ బుద్ధుని తర్వాత బసవేశ్వరుడు ఆదర్శనీయుడని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆ రోజుల్లో అనుభవ మండపాలను ఏర్పాటు చేసి అన్ని సామాజికవర్గాల ప్రజలకు న్యాయం జరగేలా చేసిన విశ్వగురువు బసవేశ్వరుడన్నారు. అప్పటి అనుభవ మండపాల మాదిరిగానే ఇప్పుడు అసెంబ్లీ.. పార్లమెంట్లను నిర్వహించుకుంటున్నామన్నారు.
మున్సిపాలిటీల అభివృద్ధిపై త్వరలో సమీక్ష
జిల్లాలోని జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యను పరిష్కరించి ఈ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని ఎన్నికలయ్యాక అందర్నీ కలుపుకుని పోతామన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. 150 ఎకరాల భూమిని కేటాయించి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి
ఇందిరమ్మకు మెదక్తో విడదీయలేని అనుబంధం..
మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు విడదీయలేని అనుబంధం ఉందని రేవంత్ పేర్కొన్నారు. ఇందిరమ్మ తన చివరి శ్వాస వదిలేవరకు మెదక్ ఎంపీగా కొనసాగారని గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ భాగారెడ్డి, ఈశ్వరీబాయిలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటారు. గీతారెడ్డి హయాంలోనే జహీరాబాద్కు నిమ్జ్ మంజూరు చేయించారని పేర్కొన్నారు. మినీ ఇండియాగా పేరున్న పటాన్చెరు ప్రాంతంలో బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్, నిమ్జ్ ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలో వచ్చినవేనని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామన్నారు. మెదక్ సాగు, తాగునీరు, పరిశ్రమల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు.
కో–ఆపరేటివ్ సెక్టార్లో చక్కెర పరిశ్రమ
త్వరలో హుందాయ్ కార్ల పరిశ్రమ పనులు ప్రారంభం
సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధి
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు
బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి

ఇందిరమ్మ ఇళ్లు