
గుణాత్మక విద్యను అందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్
తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
పాపన్నపేట(మెదక్): సామర్థ్యాలను పెంపొందించి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం పాపన్నపేటలో నిర్వహిస్తున్న టీచర్ల శిక్షణను సందర్శించి మాట్లాడారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితం రావాలని చెప్పారు. మారుతున్న కాలానుగుణంగా బోధనా పద్ధతులను ఆధునీకరించాలని సూచించారు. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థికి నేర్పినప్పుడే శిక్షణ అర్థవంతమవుతుందని వివరించారు. ఆయన వెంట డీఈఓ రాధాకిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి, ఎంఈఓ ప్రతాప్రెడ్డి, ఆర్పీలు ఉన్నారు. అనంతరం ఆగ్రోస్ రైతు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు అనధికారిక డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సబ్సిడీపై విత్తనాలు దొరుకుతాయని చెప్పారు. విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు తప్పకుండా పొందాలన్నారు. విత్తనాలను అధిక ధరకు విక్రయించరాదని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయ అధికారి నాగమాధురి ఉన్నారు.
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకంపై ఉక్కుపాదం మోపేందుకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పోలీస్, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ జాయింట్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్, వ్యవసాయ శాఖల దేనిని స్పష్టం చేశారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ద్వా రా సమన్వయంతో పని చేస్తామని తెలిపా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, పోలీస్, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని నాగ్సాన్పల్లిలో ధాన్యాన్ని పరిశీలించారు. వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతులు ఆందోళనకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి మొదట తడిసిన ధాన్యాన్ని లారీలు, ట్రాక్టర్లలో తరలించాలన్నారు. నాగ్సాన్పల్లిలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నా పట్టించుకునే వారే లేరని వాపోయారు. ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి కూడా చూసిన పాపాన పోలేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోకపోతే రైతు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఆమె వెంట బీఆర్ఎస్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సోములు, మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

గుణాత్మక విద్యను అందించాలి