
హడలెత్తిస్తున్న హైవే!
● ప్రమాదాలకు నిలయంగా 161 జాతీయ రహదారి ● కిలోమీటర్ వ్యవధిలోనే యాక్సిడెంట్లు
టేక్మాల్ (మెదక్): సంగారెడ్డి– నాందేడ్ అకోల ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మా రింది. ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. టేక్మాల్ మండలం బొడ్మట్పల్లికి ఆనుకొని ఉన్న 161 హైవే కిలోమీటర్ పరిధిలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా హైవే అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రమాదాలు కోకొల్లలు
● ఈనెల 5వ తేదీన నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనం అధిక వేగంతో టైరు పగిలి బోల్తా పడింది. దీంతో కారు ధ్వంసం కావడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి.
● గతేడాది నవంబర్ 16వ తేదీన బొడ్మట్పల్లికి చెందిన ఓ మహిళ వ్యవసాయ పనులు ముగించుకొని రోడ్డు దాటుతుండగా అధిక వేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
● గతేడాది జులై 7వ తేదీన మండలంలోని కడిలాబాయితాండకు చెందిన మహిళా కూలీ పని ముగించుకొని రోడ్డు దాటుతుండగా వేగంతో వచ్చిన కారు ఢీకొని మృతి చెందింది.
● గతేడాది మే 5వ తేదీన సంగారెడ్డి నుంచి ఖేడ్ వైపు వెళుతున్న కారు బొడ్మట్పల్లి శివారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా తగలబడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తృటిలో ప్రమాదం తప్పింది.
● గతేడాది మే 4వ తేదీన చెందిన అనిల్ అనే వ్యక్తి హైదరాబాద్ వెళుతుండగా బొడ్మట్పల్లి వద్ద డివైడర్కు ఢీకొని కారు బోల్తా కొట్టింది. యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
● 2023 అక్టోబర్ 15న హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళుతున్న టవేరా అధిక వేగంతో అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా హైవేపై నిత్యం ఏదో ఒక రూపంలో ఇలాంటి సంఘటనలు కొకొల్లాలుగా జరుగుతున్నాయి.
బొడ్మట్పల్లి వద్ద హైవేపై బోల్తాపడిన కారు (పైల్ )
నివారణ చర్యలు శూన్యం
నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా హైవే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయా ణికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి ఆనుకొని ఉన్న హైవే డివైడర్ మధ్యలో విద్యుత్ బల్బులు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. బొడ్మట్పల్లి వద్ద అండర్పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, హైవేపై సూచిక బోర్డులు, విద్యుత్ బల్బులు, వేగ నియంత్రణ బోర్డులతో పాటు లైనింగ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరారు. పలుమార్లు వినతిపత్రం రూపంలో అందించారు. వినతులను పై అధికారులకు పంపిస్తున్నామని, నివారణ చర్యలు చేపడతామని చెబుతూ పనులు మాత్రం చేపట్టడం లేదు.