
చిత్తశుద్ధితో పనిచేయండి
● అధికారులకు ఎంపీ రఘునందన్ సూచన ● నిధుల ల్యాప్స్పై మండిపాటు ● సమాచారం లేకుండా మీటింగ్కుఎలా వస్తారని నిలదీత
మెదక్జోన్: అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆదేశించారు. గురువారం జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కనీస సమాచారం లేకుండా మీటింగ్కు ఎలా వస్తారని అధికారులను నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు జిల్లా ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి క్లీనింగ్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా జిల్లాకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మన ఊరు– మనబడి కింద చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు కాలేదని, చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. ఉన్నతాధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సబ్ సెంటర్కు నిర్మాణాలకు సంబంధించి అదనపు నిధుల కోసం కేంద్ర ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ కళాశాల మంజూరైనప్పటికీ నేటికీ భవన నిర్మాణం ప్రారంభం కాలేదని, సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో నియమించలేదని ప్రిన్సిపాల్ ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. పీడీఎస్ బియ్యం అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. నేషనల్ హైవే ద్వారా చేపట్టిన మెదక్– సిద్దిపేట రోడ్డు, స్టేజ్ వన్ ఫారెస్ట్ క్లియరెనన్స్ విషయంలో నేషనల్ హైవే, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ప నులు చేయాలన్నారు. మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా ఓ పత్రిక ఐదు భారతీయ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చి వేసిందని ప్రచారం చేయటంపై ఎంపీ మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ రాహుల్రాజ్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.