
యోగమెప్పుడు?
మల్లన్నా.. డిజిటల్
సాంకేతికతకు దూరంగా కొమురవెల్లి ఆలయం
●ఆన్లైన్ చెల్లింపులు లేక భక్తుల అవస్థలు
●ఏటా కోటి మంది దర్శనం
●స్వామి వారి వార్షిక ఆదాయం రూ. 20 కోట్లపైనే..
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి. స్వామి వారిని ఏటా కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. ఆలయానికి సుమారు రూ.20 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతున్నా సాంకేతికతకు దూరంగా ఉంది. ఇప్పటి వరకు ఆన్లైన్ సేవలు అమలు కాకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్థిక వ్యవహారాలలో పారదర్శకతతో పాటు భక్తులు సులువుగా సేవలను పొందేందుకు ఆస్కారం లేకుండా పోయింది.
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులు.. వసతి గదులు, దర్శనం, నిత్యకల్యాణం, రుద్రాభిషేకం, అర్చన, పట్నం వేయడం, తలనీలాలు, ఒడిబియ్యం, బోనం తదితర ఆర్జిత సేవల కోసం రుసుం చెల్లించి టికెట్లు తీసుకోవాలి. రద్దీ ఎక్కువగా లేకపోతే పది పదిహేను నిమిషాలలో టికెట్లు లభిస్తాయి. రద్దీ ఎక్కువగా ఉంటే మాత్రం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించాల్సి వస్తోంది. స్వామి వారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఏటా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు పట్నాలు, బోనాల టికెట్లను ఆలయం విక్రయిస్తోంది.
భక్తుల్లో అసహనం..
భక్తులు స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడే నిత్యాన్నసత్రానికి, కాటేజీల నిర్మాణాలకు విరాళాలు చెల్లిస్తుంటారు. ఆలయంలో ఆన్లైన్ సేవలు లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ వ్యవస్థను తీసుకురావడానికి ఆలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడం లేదు. మూడేళ్ల క్రితమే హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరాలయం, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో కూడా సాంకేతికత సాయంతో డిజిటల్ హుండీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లన్న ఆలయం సాంకేతికతలో వెనుకబడి ఉందని చెప్పవచ్చు.

యోగమెప్పుడు?